ఈ సారు రూటే సపరేట్.. ఫెయిల్యూర్‌తో సరికొత్త మార్గం

by  |
ఈ సారు రూటే సపరేట్.. ఫెయిల్యూర్‌తో సరికొత్త మార్గం
X

దిశ ప్రతినిది, కరీంనగర్: ఫెయిల్యూర్ ద్వారా వచ్చే అనుభవాలను సక్సెస్ కోసం మల్చుకుంటారు కొందరు. చివరి మెట్టు ఎక్కే వరకూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. విజయాన్ని అందుకున్న తరువాత ఆ అనుభూతిని పొంది తన్మయత్వంలో మునిగితేలుతారు. కానీ ఈ మాస్టారు కాస్తా డిఫరెంటనే చెప్పాలి. తను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలం అయినా ఈ పరిస్థితి తెలుగు తేజాలకు రాకూడదని ధృడంగా నిర్ణయించుకున్నారు. అంతే తన ఆలోచనలకు తగ్గట్టుగా ఆచరణ మొదలు పెట్టారు. సివిల్ సర్విసెస్‌కు ఎంపిక కావాలని ప్రయత్నించి విఫలం అయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని సక్సెస్ థింకింగ్ ఇది.

టార్గెట్ రీచ్ కాకపోయినా..

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్లకు చెందిన నారోజు శంకరాచారి కరీంనగర్ జిల్లా రామకృష్ణ కాలనీలో ఉపధ్యాయునిగా పనిచేస్తున్నారు. మొదట 1994లో డిగ్రీ పూర్తయిన తరువాత అంబేద్కర్ స్టడీసర్కిల్ ముద్రించిన నోట్స్ ఆధారంగా మేయిన్ ఎగ్జామ్ రాశారు. ఓ సారి సివిల్ సర్విసెస్‌కు అటెమ్ట్ చేసి సక్సెస్ కాలేకపోయారు. 2005 నుంచి 2011 వరకు గ్రూప్ వన్‌కు అయినా ఎంపిక కావాలని మూడు సార్లు ప్రయత్నించారు. 2002లోనే ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సాధించిన శంకరాచారి గ్రూప్ వన్ అధికారి కావాలన్న తపనతో ముందుకు సాగారు. మొదటి రెండు సార్లు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహాకారంతో ప్రిపేర్ అయ్యారు. 2011లో అయితే ఏడాదిన్నర పాటు ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ప్రిపేర్ అయ్యారు. మెయిన్స్ వరకూ వెళ్లి విఫలం అవడంతో ఆయన తన టార్గెట్‌ను మార్చుకున్నారు. తన ఫెయిల్యూర్ స్టోరీని నేటి తరానికి సక్సెస్ మంత్రగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తను చేసిన ప్రయత్నాల్లో లోపాలు ఎక్కడ ఉన్నాయి? అని వెతికారు. తర్వాత వాటిని సరిదిద్దుకున్నా తనకు మాత్రం ఫలితం దక్కే అవకాశాలు లేవని తెలిసి లోతుగా అధ్యయనం చేశారు శంకరాచారి.

బడిలో పాఠాలు చెప్పి విద్యార్థులను తీర్చిదిద్దడంతోనే సరిపెట్టుకుంటే లాభం లేదనుకున్నారు. ఇందుకు కావల్సిన ఏర్పాట్లు స్వతహాగా చేసుకుని నేటి తరాన్ని అన్నింటా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న చాలామంది బేసిక్స్ పై పట్టు సాధించకపోవడం వల్లే మెయిన్స్ వరకో, ప్రిలిమ్స్ వరకో వెళ్లి విఫలం అవుతున్నారని గమనించి సివిల్స్ ప్రిపేర్ కావాలన్న లక్ష్యంతో ఉన్నవారికి దిశానిర్దేశం చేయడం ఆరంభించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా ఎదో ఓ చోట బ్రేకులు పడుతున్నాయని గమనించారు. ఇందుకు బేసిక్స్ లేకపోవడమే కారణమని భావించి ఈ మేరకు తన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. కొంతకాలం సాయంత్రం వేళల్లో ఇంట్లోనే ప్రాక్టికల్ క్లాస్ లు చెప్పారు. ఇంగ్లీష్ పై పట్టు సాధించడంతో పాటు కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్స్ తదితర అంశాలపై కూలంకషంగా బోధించే పనిలో నిమగ్నం అయ్యారు. యూపీఎస్సీ ప్రిలిమనరీ పరీక్షలకు అవసరమైన టిప్స్ కూడా వారికి నేర్పించారు.

సోషల్ మీడియా వేదికగా..

2019 నుండి ప్రపంచాన్ని కలవరపెట్టిన కరోనా మహమ్మారి ప్రభావం శంకరాచారి లక్ష్యానికి కూడా బ్రేకులు వేసింది. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికను ఎంచుకుని బేసిక్ ఫౌండేషన్ ద్వారా నేర్పించే పనిలో నిమగ్నం అయ్యారు. వాట్సప్, టెలిగ్రాంలలో గ్రూపులు క్రియేట్ చేయడంతో పాటు యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 350 మందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రిపేర్ అయ్యే వెయ్యిమందికి బేసిక్స్‌పై పట్టు సాధించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు శంకరాచారి.

ఐఏఎస్ నా లక్ష్యం..

కేవలం బోధన ద్వారానే కాకుండా తన రచనలతో కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి గైడ్ లా పనిచేస్తుందని భావించారు. ఈ మేరకు ’’ఐఏఎస్ నా లక్ష్యం‘‘ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ముద్రణ పూర్తయిన ఈ పుస్తకం నేడో రేపో మార్కెట్లో విడుదల కానుంది. తన తొలి ప్రయత్నాన్ని తన గ్రామం నుండే ఆరంభించాలని భావించారు. ఇందుకోసం ఒకరు ఒక పుస్తకం అన్న పిలుపు ఇచ్చి విజ్ఞాన భాండాగారాన్ని ప్రారంభించారు. తన గ్రామానికి చెందిన యువత ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న తపనతో ఈ లైబ్రరీని ప్రారంభించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చే ప్రారంభోత్సం చేయించారు. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి తర్ఫీదు ఇవ్వాలని బేసిక్స్ లో సుశిక్షుతులను చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు స్టూడెంట్స్ ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. 2022లో శంకరాచారి ద్వారా బేసిక్స్ పై పట్టు సాధించిన వారు పెద్ద సంఖ్యలో సివిల్స్‌లో తమ సత్తా చాటుకునే అవకాశాలు ఉన్నాయి.

Next Story

Most Viewed