రైతులు చస్తున్నా వడ్లు కొనరా? బండి సంజయ్..

by  |
రైతులు చస్తున్నా వడ్లు కొనరా? బండి సంజయ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. వడ్లు కొనరా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్​ సమావేశాల్లో ఆయన టీఆర్ఎస్​ ఎంపీలపై ఫైరయ్యారు. ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో గొడవ చేస్తుండగా వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనే దిక్కులేక వరి కుప్పలపై పడి రైతులు ప్రాణాలిడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

క్యాంటీన్​లో ప్లకార్డుల ఫొటోలు చూపించి పార్లమెంట్​ అంటారా?

యాసంగి పంట కొనబోమని మీకెవరు చెప్పారని, రా రైస్ పక్కాగా కొంటామని కేంద్రం చెబుతున్నా ఎందుకీ డ్రామాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోని క్యాంటీన్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపిన ఫొటోలను పార్లమెంట్ లో నిరసన తెలిపినట్లుగా చెప్పుకోవడానికి సిగ్గుపడాలని విమర్శించారు.

జేపీ నడ్డాతో బీజేపీ ఎంపీల భేటీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎంపీలు అర్వింద్, సోయం బాపురావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రమణ్యం భేటీ అయ్యారు. తొలుత జేపీ నడ్డా పుట్టినరోజును పురస్కరించుకుని వారు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేస్తున్న ఉద్యమాలపై ఆయనతో చర్చించారు.


Next Story