భారత మార్కెట్లో కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల

by  |
భారత మార్కెట్లో కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో భారత మార్కెట్లోకి తన కొత్త పల్సర్ సిరీస్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 పేరుతో వస్తున్న ఈ బైక్ సరికొత్త స్పోర్ట్ వెర్షన్ అని కంపెనీ తెలిపింది. ఈ బైక్ ధర రూ. 93,690(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఈ సరికొత్త బైక్ పల్సర్ సిరీస్‌లో అత్యంత సరసమైన ధర, తక్కువ సీసీతో లభిస్తుందని, ప్రత్యేకించి భారత్‌లో యువ కొనుగోలుదారులను లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్‌లో ఇప్పటికే పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్లను మార్కెట్లో విక్రయిస్తోంది.

వీటి ధరలు రూ. 1.11 లక్షల నుంచి రూ. 1.35 లక్షల వరకు ఉన్నాయి. మంగళవారం ఈ సిరీస్‌లో కొత్త పల్సర్ ఎన్ఎస్ 125ని తీసుకొచ్చింది. ఈ కొత్త మోటార్‌సైకిల్ బీఎస్6 125 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ వేరియంట్‌లో ఇంజిన్ మార్పు మినహాయించి డిజైన్ పరంగా అచ్చు పల్సర్ ఎన్ఎస్ 16 మోడల్‌లాగా ఉంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ‘కొత్త పల్సర్ ఎన్ఎస్ 125 మోడల్ అన్ని రకాలుగా టూ-వీలర్ కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది. ఎంట్రీ స్పోర్ట్ బైక్ విభాగంలో బజాజ్ పల్సర్ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్టు’ బజాజ్ ఆటో మోటర్ సైకిల్స్ ప్రెసిడెంట్ సారంగ్ కనడె చెప్పారు. ధర పరంగా పల్సర్ ఎన్ఎస్160 కంటే రూ. 16 వేలు తక్కువకే ఇది లభిస్తుందని ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed