ఆ ఉద్యోగులకు శుభవార్త.. ఇంక్రిమెంట్ ఇస్తున్నట్టు ప్రకటన!

by  |
ఆ ఉద్యోగులకు శుభవార్త.. ఇంక్రిమెంట్ ఇస్తున్నట్టు ప్రకటన!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో అధిక శాతం కంపెనీలు కరోనా సంక్షోభం పేరుతో వేతనాల కోత విధించడం, శ్రామిక శక్తిని తగ్గించాలని చూస్తున్న సమయంలో ఏషియన్ పెయింట్స్ మాత్రం వీటికి భిన్నంగా తన వార్షిక వేతనాల పెంపు ఉంటుందని తెలిపింది. ‘ఇలాంటి సమయంలో ఉద్యోగుల మనోస్థైర్యాన్ని పెంచేందుకే ఈ ఏడాదికి ఇంక్రిమెంట్ ఇస్తున్నట్టు’ ఓ అధికారి స్పష్టం చేశారు. కొవిడ్-19 వ్యాప్తి ఉన్నప్పటికీ మేము ఉద్యోగులను తొలగించలేదు. ఉద్యోగులను తొలగించడం కంపెనీ విధానాలకు విరుద్ధమని ఆ అధికారి తెలిపారు.

అసాధారణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ప్రస్తుత త్రైమాసికంలో సంస్థ ఆదాయం బలహీనంగా ఉన్నప్పటికీ వేతనాల పెంపుతో ముందుకెళ్లాలని సంస్థ నిర్ణయించిందని ఏషియన్ పెయింట్స్ ఎండీ అమిత్ సింగాల్ చెప్పారు. అలాగే, డీలర్ల రాయితీలను పొడిగించింది. గతవారం సంస్థ డీలర్లకు రాసిన లేఖలో.. ఏషియన్ పెయింట్స్ దుకాణాల్లో ఉచిత శానిటైజేషన్, దుకాణంలో పనిచేసే వారికి, పెయింటర్లకు ఉచిత వైద్య బీమా, సంస్థకు చెల్లించాల్సిన చెల్లింపుల్లో 45 రోజుల పొడిగింపు, 45 రోజుల్లోపు చెల్లింపులకు 2 శాతం తగ్గింపును ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ నిర్ణయాలు సంస్థకు తక్షణ ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకపోయినప్పటికీ, ఉద్యోగులు, సంస్థ భాగస్వాములైన ముఖ్య వాటాదారులతో సంబంధాలను సుస్థిరం చేసుకోవడానికి ఎంతో దోహదపడతాయని సంస్థ భావిస్తోన్నది.

Next Story

Most Viewed