వారి పరిస్థితేమీ ‘ఆశా’జనకంగా లేదు!

by  |
వారి పరిస్థితేమీ ‘ఆశా’జనకంగా లేదు!
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో చంద్రకళ(పేరు మార్చాం) గత ఐదేండ్లుగా ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. కానీ, వారం రోజులుగా తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. ఒక్కోసారి తనతో తానే ఏదేదో మాట్లాడుతోంది. ఆమె పరిస్థితిపై కుటుంబ సభ్యు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. కరోనా వైరస్ నేపథ్యంలో నెల రోజులుగా విరామం లేకుండా విధులు నిర్వహిస్తోంది. దీంతో ఆమె మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తేలింది.

‘ఇకపై మీకు కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత నాది. ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యత మాత్రం మీది’ అంటూ గతంలో ఆశా వర్కర్లను ఉద్దేశించి సీఎం కేసీఆర్ అన్న మాటలివి. ఈ మాటలని సరిగ్గా నాలుగేళ్లు గడుస్తోంది. కానీ, ఇంతవరకూ వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఆశావర్కర్ల పాత్ర కీలకం. పొద్దుగాల లేచింది మొదలు.. పొద్దుగూకంగా ఇంటికి పోయే దాకా గ్రామంలో ప్రతీ ఇల్లు తిరిగి ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వారి విధి. కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచమంతా వణికిపోతున్నా ఆశా వర్కర్లు మాత్రం కరోనా వైరస్‌తోనే సావాసం చేసే పరిస్థితి.

ఆశా వర్కర్ల సహకారం మరువలేనిది..

ఎక్కడి నుంచి ఏ అధికారి వచ్చినా గ్రామాల్లో సహకరించేది వీళ్లే. ప్రతి కార్యక్రమం అమలు చేయడంలో ఆశా వర్కర్ల సహకారం మరువలేనిది. అయితే వారు క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీఇన్నీకావు….!

అనుమానంగా చూస్తున్రు..!

కరోనా వైరస్ నేపథ్యంలో ఆశా వర్కర్లు ఇంటింటికి తిరగాల్సి వస్తోన్నది. వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం దగ్గరి నుంచి జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం అనుమానం ఉన్నా.. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాలి. దీనికితోడు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ వెళ్లాల్సి వస్తో్ంది. దీంతో గ్రామస్తులు ఆశా వర్కర్లు ఇంటికి రాగానే దూరంగా ఉంచుతూ అనుమానంగా చూస్తున్నారు. దీంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.

మంచినీళ్లు ఇచ్చేందుకు వెనకాడుతున్రు..

కరోనా వైరస్ విధుల్లో భాగంగా ఆశా వర్కర్లు పొద్దున పూట బయటకు వెళితే.. ఏ రాత్రికో ఇంటికి చేరుతున్నారు. అయితే మంచినీళ్లు, తిండి విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో ఎవరి ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగినా ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. వాడి పారేసిన బాటిళ్లలో ఇస్తున్రు. కొంతమంది అయితే అసలు ఇంట్లోకే రానివ్వడం లేదు.

భౌతిక దాడులకు దిగుతున్రు..

గ్రామంలోకి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారని తెలిస్తే వారి వివరాలు సేకరించాల్సిన బాధ్యత ఆశా వర్కర్ల మీదే ఆధారపడి ఉంది. లాక్‌డౌన్ సమయంలో బయటి ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చినవారి వివరాలు తీసుకునేందుకు వారి ఇంటికి వెళ్లే సమయంలో భౌతిక దాడులకు దిగుతున్రు. కొంతమంది నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. యాచకులకన్నా అధ్వానమైంది వారి పరిస్థితి. ఇంట్లోకి వస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు నెట్టేస్తున్రు. అయినా విధులు నిర్వహించక తప్పడం లేదు. అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న పలువురిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు పెద్దగా పట్టించుకోవడం లేదని పలువురు ఆశా కార్యకర్తలు వాపోతున్నారు.

శానిటైజర్ల ఊసే లేదు..

గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో ఎవరి నుంచి వైరస్ ముప్పు పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. కరోనా వైరస్ నుంచి ఆశా వర్కర్లు రక్షణ పొందేందుకు వారి చేతులకు గ్లౌజులు, మాస్క్ లు అందివ్వడం లేదు. కనీసం చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లనూ అధికారులు అందివ్వడం లేదు. పైగా కరోనా వైరస్ పేరుతో ప్రతి పనికి ఆశా వర్కర్లను వినియోగిస్తున్నారు. కానీ, కనీసం వారి డైలీ ఖర్చులకు కూడా పైసా చెల్లించడం లేదు. దీంతో మా బతుకులు దినదిన గండంగా ఉన్నాయని పలువురు ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

tags: Nalgonda, asha workers, corona Effect, trouble


Next Story

Most Viewed