వర్షాకాలం: ముప్పు ముంచుకొస్తున్న.. బల్దియా చర్యలు శూన్యం

by  |
GHMC officials
X

దిశ, సిటీ బ్యూరో: వర్షాకాలం కష్టాలను తగ్గించటంలో జీహెచ్ఎంసీ అధికారుల్లో చిత్తశుద్ధి లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే వస్తాయని, ఆ ప్రభావంతో రేపోమాపో భారీ వర్షాలు కురుస్తాయని పక్షం రోజుల నుంచి వాతావరణ శాఖ ప్రకటనలు చేస్తున్నా, ఒకవైపు నుంచి ముప్పు ముంచుకొస్తున్నా, బల్దియా అధికారులు ఇప్పటి వరకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి నెల రోజుల ముందే అత్యవసర బృందాలు, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, అధికారికంగా అధికారులే వివరాలు ప్రకటించేవారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి తానంతట తాను చొరవ తీసుకుని సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తే తప్పా, తాము వర్షకాలం కష్టాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలన్న తమ విధులు గుర్తుకు రాలేదు. వర్షం కురిసినపుడు ప్రజలకెలాంటి కష్టం రాకుండా చూడాలని, ఎలాంటి విపత్తు జరగకుండా ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలన్న ముందు చూపు కూడా లేకుండా పొయింది. సోమవారం మేయర్ నిర్వహించిన సమీక్షలో కూడా పాలక వర్గానికి గానీ, అధికార వర్గానికి గానీ అసలు నాలాల పూడికతీత పనులపై స్పష్టమైన అవగాహన లేదని తేలిపోయింది.

ఒక వైపు ఈ నెలాఖరకల్లా నాలా పూడికతీత పనులను పూర్తి చేయాలని మేయర్ డెడ్ లైన్ విధించగా, మరో కమిషనరేమో నాలాల పూడికతీత పనులు దాదాపుగా పూర్తయ్యాయని సమాధానమిచ్చారు. నాలాల విస్తరణ, అభివృద్ది పనులకు సర్కారు రూ.858 కోట్లు మంజూరు చేసిందని, అందుకు అవసరమైన డీటైల్ ప్రాజెక్టె రిపొర్టు(డీపీఆర్)లను తయారు చేయాలని మేయర్ అధికారులను ఆదేశించగా, చీఫ్ ఇంజనీర్ వసంత కూడా నాలాల విస్తరణ, అభివృద్ది కోసం రూ.850 కోట్లతో తయారు చేసిన అంచనాలకు సర్కారు నుంచి పరిపాలనపరమైన మంజూరీ వచ్చిందని చెప్పారు. మేయర్, కమిషనర్ చీఫ్ ఇంజనీర్ ఈ సమీక్షలో అసలేం మాట్లాడారో పొంతన లేకుండా పోయింది. ఒకరు పనులు పూర్తయ్యాయని చెబుతుంటే మరొకరు డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని అంటున్నారు. మరొక అధికారేమో పనులు పూర్తయ్యాయని అన్నారు. సదరు అధికారి ఓ సారి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12కు సమీపంలోని పెన్షన్ ఆఫీసు పక్కనే ఉన్న బల్కాపూర్ నాలాను గమనిస్తే ఈ సమీక్షలో అధికారవర్గం, పాలక వర్గం వాస్తవాలు మాట్లాడారా? నగరాభివృద్ది, ప్రజాసమస్యల పరిష్కారానికి వారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో తేలిపోతోంది.



Next Story