దర్జాగా నయా నకిలీ దందా.. పోలీసుల వలలో ఏడు చేపలు..

by  |
దర్జాగా నయా నకిలీ దందా.. పోలీసుల వలలో ఏడు చేపలు..
X

దిశ, శేరిలింగంపల్లి: నకిలీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్ సీ), ఆధార్ కార్డ్ లు తయారు చేస్తున్న ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఘనపురం మండలం వర్దరాజుపురం గ్రామానికి చెందిన చామన సతీష్ ( 32) శంషాబాద్ మండలం రాళ్లగూడ గ్రామంలో నివసిస్తున్నారు. అలాగే యూసఫ్ గూడకు చెందిన షేక్ జంగీర్ బాషా ( 50) ఆర్టీఏ ఏజెంట్, వెస్ట్ గోదావరి పాలకొల్లు నివాసి కలిగేడి రామకృష్ణ( 44), ఎం. గణేష్, కాటేదాన్ మధుబన్ కాలనీ, ఈస్ట్ గోదావరి అమలాపురం మండలం నల్లమెల్లికి చెందిన ఎం. గణేష్ (29) హైదరాబాద్ కిషన్ బాగ్ కు చెందిన ఆర్టీఏ ఏజెంట్ సయ్యద్ హుస్సేన్ (35), విజయవాడకు చెందిన కోటేశ్వరరావు (36), భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన సంపత్ ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆర్ సీలు, ఆధార్ కార్డులు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.

నెయిల్ పాలిష్ రిమూవర్ (డాజ్లర్)ని ఉపయోగించి కార్డ్ డేటాను చెరిపేసి వారికి కావాల్సిన విధంగా కార్డులు తయారు చేస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు, ఆధార్ కార్డులను ప్రింట్ చేసి, వివిధ ఫైనాన్షియర్ల నుంచి వేలంలో వాహనాలను తీసుకెళ్లి నిరుపేదలకు విక్రయిస్తూ నకిలీ ఆర్సీ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం అంతా భద్రాద్రి కొత్తగూడెం వేదికగా సాగుతున్నట్లు తెలిపారు. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి 1200 నకిలీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, 29 స్టాంపులు, కంప్యూటర్ సిస్టమ్స్, ప్రింటర్లు, నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ లకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులకు సీపీ నగదు బహుమతులు అందజేశారు.


Next Story

Most Viewed