నాగర్ కర్నూల్‌లో ఉద్రిక్తత.. నేతలంతా అరెస్ట్

by  |
నాగర్ కర్నూల్‌లో ఉద్రిక్తత.. నేతలంతా అరెస్ట్
X

దిశ, నాగర్ కర్నూల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష నేతలు ఇచ్చిన భారత్ బంద్‌ను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి పోలీసులు ఆయా డిపోల వద్ద నిఘా పెట్టి అఖిలపక్షం నేతలను వచ్చిన వారిని వచ్చినట్లుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో యథావిధిగా ప్రజా రవాణా వ్యవస్థ కొనసాగుతోంది.

నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వార్ల వెంకటయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, ఏఐటియుసీ నేతలు కొమ్ము భరత్ తదితర ముఖ్య నేతలంతా నాగర్ కర్నూల్ బస్ డిపో ముందు ధర్నా నిర్వహించారు. వెంటనే సీఐ గాంధీ నాయక్, ఎస్ఐ విజయ్ కుమార్, మాధవ రెడ్డి.. పోలీస్ బందోబస్తుతో వారిని బిజినపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అంతకుముందు వంశీకృష్ణ మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మద్దతు తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పోలీసులు సహకరించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీ కాళ్ళపైన మోకరిల్లి.. అనంతరం రైతు చట్టాలకు మద్దతు పలకడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష నేతలంతా ధర్నా చేపడితే పోలీసులు ఒక్క క్షణం ఆలోచన చేయకుండా వెంటనే అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.


Next Story