ఊపిరి తీసిన దోపిడీ

by  |
ఊపిరి తీసిన దోపిడీ
X

దిశ, సిరిసిల్ల: ఇసుక అక్రమ దందా చేస్తున్న వ్యాపారుల చేతుల్లో విద్యార్థుల నిండు ప్రాణాలు పోతున్నాయి. సిరిసిల్ల జిల్లాలో మానేరు నదితో పాటు వివిధ గ్రామాల వాగుల్లోంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యాపారులు బాలకార్మికులు,విద్యార్థులతో పనులు చేయించుకుంటున్నా అధికారయంత్రాంగం చోద్యం చూస్తోంది.ముస్తాబాద్ మండలం గండిలచ్చపేట సమీపంలోని మానేరు నదిలో ఇసుక నింపేందుకు వెళ్లిన ఓ విద్యార్థి ట్రాక్టర్ బోల్తాపడి మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన దండ్ల రాకేష్ అనే 10వ తరగతి విద్యార్థి ఆదివారం రాత్రి శివరాత్రి ఉదయ్,సూర నవీన్,అల్లెపు బన్నీ అనే స్నేహితులతో కలిసి గండిలచ్చపేట గ్రామ సమీపంలోని మానేరు నదిలో ఇసుక ట్రాక్టర్లు నింపేందుకు కూలీకి వెళ్లాడు.ట్రాక్టర్‌ నింపాక,అన్‌లోడ్‌ చేసి ఇంటికి వెళ్లేందుకు డ్రైవర్ వినయ్ తో TS 23 B 8273 నంబరు గల ట్రాక్టర్ పై రాకేష్ తో సహా ముగ్గురు స్నేహితులు వెనుక ట్రాలీలో కూర్చున్నారు. సూర్యోదయం అయ్యేలోపు ఇసుకను సరిహద్దు దాటించాలనే ఉద్దేశంతో డ్రైవర్ వినయ్ ట్రాక్టర్ ని అతివేగంగా పోనిచ్చాడు.పోత్గల్ గ్రామ శివారుకి రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ తీవ్రంగా గాయపడ్డాడు.ఆస్పత్రికి తరలిస్తుండగా రాకేష్ ప్రాణాలు కోల్పోయాడు.అతని స్నేహితులు తీవ్ర గాయాలతో సిద్దిపేట లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.డ్రైవర్‌ నిర్లక్ష్యంగా అతివేగంగా ట్రాక్టర్ నడపడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అని స్థానికులు పేర్కొన్నారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను అధికారులు గాలికి వదిలేశారనే విషయం ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చింది. మానేరు నుంచి కొందరు వ్యాపారులు రాత్రివేళ అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా.. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలున్నాయి.

ఒకవైపు మానేరు నుంచి ప్రభుత్వపరంగా ఇసుక తరలింపునకు అనుమతులుండగా, మరోవైపు రాత్రివేళ అక్రమ దందాకు కొందరు తెరలేపారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లను పెట్టి ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక నింపేందుకు వందల మంది కూలీలను వినియోగిస్తుండగా వీరిలో విద్యార్థులను సైతం కూలీలుగా మార్చుతున్నారు. వీరిలో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వచ్చే డబ్బు ఇంటి అవసరాలకు చేదోడువాదోడుగా ఉంటుందనే ఆశతో ఇసుక నింపేందుకు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాలలను కార్మికులుగా వినియోగిస్తున్న ఇసుక వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

లాక్డౌన్ వేళ.. ఎందుకిలా..

అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు వెళ్ళవద్దని ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో మానేరు వాగు నుంచి ఇసుక తరలించడం అధికారుల విధి నిర్వహణ పై అనుమానాలను రేకెత్తిస్తుంది.రాత్రి సమయంలో రోడ్డుమీదికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి పోయి అక్రమంగా ట్రాక్టర్లతో ఇసుకను అతివేగంగా తరలిస్తూ రోడ్ల మీదకు వాహనాలు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవడంలో రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రోడ్డు రవాణా శాఖ అధికారులు విఫలమవడంతో పలువురు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి దీనికి అధికారులు బాధ్యత వహించాలని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముస్తాబాద్ లో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడడంతో నే ఒకరు మృతి చెందారని స్థానికంగా అందరికీ తెలిసిన ఏం జరిగిందో తెలియదు కానీ కూలి పనికి వెళ్లి ఈ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదులో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పేదరికంలో ఉన్న కుటుంబంపై కావాలనే ఒత్తిడి పెంచి ప్రమాదంలో మరణించిన వ్యక్తి కూలి పనికి వెళ్లి మరణించినట్లు సీన్ క్రియేట్ చేసారని గ్రామంలో చర్చ జరుగుతోంది.

Next Story

Most Viewed