ఫేక్‌ న్యూస్‌పై ఏపీ సర్కార్ కొరడా.. దొరికితే జైలుకే

by  |
ys jagan
X

దిశ, వెబ్ డెస్క్: ఫేక్ న్యూస్ లపై ఏపీ ప్రభుత్వం కన్నెర్రజేసింది. కొందరు ఆకతాయిలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు..అలాగే ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. శుక్రవారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు ఈ వెబ్ సైట్ ను జగన్ ప్రారంభించారు. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో ఓ వ‌ర్గం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుందని..వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే ఈ ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ను ప్రారంభించినట్లు సీఎం జగన్ తెలిపారు.

వాస్తవాలను అందించడంతోపాటు వెబ్‌సైట్‌లో ఫేక్, ఫ్యాక్ట్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచేలా ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లలో అత్యంత నమ్మకం కలిగించేలా వైరల్‌ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మొద్దని హితవు పలికారు. సంస్థలు, మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

దురుద్దేశపూర్వక ప్రచారం మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం మొదట ఎక్కడనుంచి మొదలయ్యిందో దాన్ని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదని జగన్ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. వ్యవస్థలను తప్పుదోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదన్నారు.

ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేసినా.. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారం చేసినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాద్‌ దాస్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జి.వి.డి కృష్ణమోహన్, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి, డీఐజీ (టెక్నికల్‌ సర్వీసెస్‌) జి. పాలరాజు, ఏపి డిజిటల్‌ కార్పొరేషన్‌ విసి అండ్‌ ఎండీ చిన్న వాసుదేవరెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Next Story

Most Viewed