ఈ నెలాఖరున ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

by  |
ఈ నెలాఖరున ఏపీ అసెంబ్లీ సమావేశాలు?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో ప్రారంభించి మెుత్తం ఐదు రోజులపాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఒకేసారి ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దాని కన్నా దఫాలుగా నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకేసారి కాకుండా విడతల వారీగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి వస్తే డిసెంబరులో కూడా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ల ఎన్నికపై కూడా ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి కనుక ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. ఈ స్థానాలను గెలుచుకున్న తర్వాతనే శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.



Next Story