Kadapaలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు..టీడీపీ నేతల అరెస్ట్

by Disha Web Desk 16 |
Kadapaలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు..టీడీపీ నేతల అరెస్ట్
X

దిశ,కడప: కడప అభివృద్ధిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు చర్చకు సవాల్ విసరడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇరు పార్టీల నాయకులను అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. కడప నగరంలో సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ రాజకీయం వేడెక్కింది. నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలు సవాల్ విసరడంతో టీటీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి.

పలువురు టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

అప్రమత్తమైన పోలీసులు.. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులురెడ్డి, రాష్ర్ట కార్యదర్శి బి హరిప్రసాద్‌లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వారి ఇళ్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఇంటి వద్ద శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకొంది. చివరకు శ్రీనివాసులురెడ్డితో పాటు టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. పోలీసుల వాహనాన్ని టీడీపీ నాయకులు అడ్డగించి వెళ్లకుండా ఆందోళన చేయడంతో వారిని కూడా పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వీళ్లందరిని ఒంటిమిట్ట టిటిడి వసతి గృహానికి తరలించారు. తమను బయటకు రాకుండా అడ్డు కోవడం దారుణమని తెలుగుదేశం నాయకులు అన్నారు. సవాల్ విసిరిన వైసీపీ నేతలను రోడ్ల పైకి వదిలి టీడీపీ నేతలను అరెస్టు చేయడం పట్ల శ్రీనివాసులురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడపలో భారీ బందోబస్తు

మరోవైపు ఇరుపార్టీల నాయకుల సవాళ్ల నేపథ్యంలో కడప నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప ఏడు రోడ్ల వద్దకు ఆందోళనకు వచ్చిన వైసీపీ నాయకులు, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్ తో పాటు పలువురు నాయకులను అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.

కడప అభివృద్ధిని ఓర్వలేకనే..

కడప నగర డిప్యూటీ మేయర్ బి నిత్యానందరెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాలో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక పబ్లిసిటీ స్టంట్ కోసం సవాళ్లు, ప్రతి సవాళ్లు చేస్తున్నారన్నారు. టీడీపీ అభివృద్ధి ఏమి చేసిందో చెప్పాలన్నారు. కడప నగరంలో ఎస్.బి అంజాద్ బాషా మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. ప్రజల్లో లేని గౌరవాన్ని పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తూ అల్లర్ల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.



Next Story