Breaking: ఎంపీ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం

by Disha Web Desk 16 |
Breaking: ఎంపీ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే భాస్కర్ రెడ్డి తనయుడు, కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని సూచించారు. దీంతో అవినాశ్ రెడ్డి అనుచరుల్లో ఆందోళన నెలకొంది. తండ్రి భాస్కర్‌రెడ్డిని పులివెందుల వెళ్లి హైదరాబాద్ తీసుకొచ్చి మరీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన తనయుడు అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ఉత్కంఠతను రేపుతోంది. అటు ఎంపీ అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.

వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్, రిమాండ్ ఇలా జరిగింది..

కాగా మాజీ ఎంపీ వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మెజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సీబీఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వైద్య పరీక్షల నివేదికను జడ్జికి సమర్పించారు. అన్ని వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి... వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 29 వరకు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధిస్తున్నట్టు సీబీఐ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో వైఎస్ భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

భాస్కర్ రెడ్డి ఆరోగ్యంపై న్యాయవాది ఏమన్నారంటే..

భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని, ఆయనను జాగ్రత్తగా చూడాలని జైలు సూపరింటిండెంట్‌కు న్యాయమూర్తి ఆదేశించారని తెలిపారు.

భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత...

కాగా పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కడప నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీ బందోబస్తు మధ్య ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఓపీ భవనంలో ఉన్న అత్యవసర విభాగంలో భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మొదట ఈసీజీ పరీక్షలు తీయగా నార్మల్‌ అని వచ్చింది. ఆ తర్వాత బీపీ పరీక్షలు నిర్వహించగా అతనికి బీపీ కొద్దిగా పెరగడంతో క్యాజువాలిటీ డీఎంవో డా.మునావర్ నేతృత్వంలో వైద్యులు భాస్కర్ రెడ్డికి బీపీ తగ్గడానికి మందులు ఇచ్చారు. అనంతరం క్యాజువాలిటీలో బీపీ తగ్గే వరకు అబ్సర్వేషన్‌లో ఉంచారు. అనంతరం సీబీఐ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో భాస్కర్ రెడ్డికి రిమాండ్ ఆదేశాలు జారీ చేశారు.

తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌పై ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆవేదన

భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. తాము చెప్పిన ఏ ఒక్క విషయాలను కూడా సీబీఐ అధికారులు పరిగణననలోకి తీసుకోవడంలేదని ఆయన వ్యా్ఖ్యానించారు. కీలకమైన అంశాల్ని సైతం సీబీఐ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వ్యక్తులే టార్గెట్‌గా సీబీఐ విచారణ కొనసాగుతోందని అవినాశ్ రెడ్డి అన్నారు. వివేకా హత్య విషయాన్ని పోలీసులకు తానే ఫస్ట్ చెప్పానని తెలిపారు. ఈ హత్యపై తనకంటే గంట ముందు వివేకా అల్లుడికి తెలుసని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తననే దోషి అంటున్నారని తెలిపారు. ధైర్యం కోల్పోమని, నిజాయితీగా కేసును ఎదుర్కొంటామని కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

ముస్లింగా పేరు మార్చుకున్న వివేకానందారెడ్డి

వైఎఎస్ వివేకానందారెడ్డి తన పేరు మార్చుకున్నారని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు. వివేకానందారెడ్డి హత్య కేసులో అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన ఎంపీ అవినాశ్ రెడ్డి.. వివేకానందారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకానందారెడ్డికి రెండో భార్య ఉందని, ఆమెకు షహెషాన్ అనే కుమారుడు ఉన్నారని తెలిపారు. అయితే ఆస్తి మొత్తం ఆమెకు రాసిచ్చేందుకు వివేకానందారెడ్డి నిర్ణయించుకున్నారని అవినాశ్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పేపర్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పారు. షేక్ అహ్మద్ అక్బర్‌గా 2010లో వివేకానందారెడ్డి పేరు మార్చుకున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

ఇవి కూడా చదవండి :

U Turn: సీఎం జగన్‌కు షాక్‌లు తప్పవా?

వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రియాక్షన్ ఇదే..!

Advertisement
Next Story