ఏపీ లిక్కర్‌స్కామ్‌పై షర్మిల కీలక వ్యాఖ్యలు.. జగన్ పై ఆరోపణలు

by Naga Rani Yarlagadda |

ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ లిక్కర్‌స్కామ్‌పై షర్మిల కీలక వ్యాఖ్యలు.. జగన్ పై ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణం వెనుక జరిగిన కుట్రలను వెలికి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ పెద్ద ఆర్థిక నేరమని, బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్స్ ను ఆపివేశారని ఆరోపించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన షర్మిల.. ఈ అంశంపై మాజీ జీఎం జగన్ ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంలో తయారీ దశ నుంచి చివరి కొనుగోలు వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. డిజిటల్ యుగంలోనూ నగదు లావాదేవీలతో మద్యం అమ్మకాలు జరిగాయని, ఇది ప్రపంచంలోనే అరుదైన ఉదాహరణ అని ఆమె విమర్శించారు. రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణమే కాకుండా, పన్నులను తప్పించేందుకు క్యాష్‌లో అమ్మకాలు చేసినట్లు పేర్కొన్నారు. బ్రాండెడ్ మద్యం నిలిపివేసి చౌక మద్యం ప్రోత్సహించడం వెనుక కుట్ర ఉన్నట్లు ఆరోపించారు. ఈ విధానాల వల్ల ఐదేళ్లలో 30 లక్షల మంది కిడ్నీ సమస్యలతో బాధపడటం, 30 వేల మందికి పైగా మృతి చెందడం దారుణమని వాపోయారు.

ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు సంఘం (సిట్) ఏర్పాటు చేయాలని, సీఎం చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. నాన్‌ డ్యూటీ పేమెంట్‌ల కింద ఎంత మద్యం అమ్మకాలు జరిగాయో వెలికితీయాలని కోరారు. డిజిటల్ పేమెంట్‌లు నిలిపివేయడం వెనుక అవినీతి ఉందని ఆమె ఆరోపించారు.

జగన్‌కు కూడా ఈ విషయాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని, అసెంబ్లీలో ఈ అంశాలను ప్రజలకు వివరించాలన్నారు. తనకు అనుకూల విషయాలనే ఎత్తి చూపుతూ, రుషికొండ తవ్వకాలకు, వివేకానంద రెడ్డి హత్య కేసుకు ఇంకా సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించడంలో నిపుణుడని ఆమె వ్యాఖ్యానించారు.

Next Story