20 ఏళ్ల క్రితం నాటి నివాసాలకు నోటీసులు.. ఆందోళనలో 32 కుటుంబాలు

by Disha Web Desk 16 |
20 ఏళ్ల క్రితం నాటి నివాసాలకు నోటీసులు.. ఆందోళనలో 32 కుటుంబాలు
X

దిశ : ఏలూరు బ్యూరో: అదో ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం. కానీ ఇన్నేళ్లు గడుస్తున్నా వారి జీవన విధానం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన హామీలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో మాత్రం శూన్యం అనిపిస్తుంది. తమకోసం ప్రత్యేక నియోజకవర్గం ఉందని సంబరపడుతున్న దళితులకు ఆఖరికి నిరాశే మిగులుతుంది. తమ సామాజిక వర్గం అంటూ వాడుకుంటూ ఓట్లు వేసుకుంటున్నారే తప్ప వారి బ్రతుకులు మార్చడానికి కాదంటూ ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆ పెద్ద నియోజకవర్గంలో 32 కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే వెళ్లి హామీ ఇవ్వటమే తప్ప అమలుకు నోచుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసి పిల్లలతో తిని తినక పొట్ట వెళ్లబుచ్చుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాలపై అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణ సంపన్నుడు తమ జీవితాలపై కార్చిచ్చుపెట్టారని రోదిస్తున్నారు. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా దళితులపై అగ్రవర్ణాల పెత్తనం చలామణి అవుతుందని అనడానికి ఈ ఘటనే నిదర్శనం


ఆవేదనలో 32 కుటుంబాలు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నాగుల గూడెం గ్రామం అది. గురవాయిగూడెం రెవెన్యూలో ఉన్న 339, 440 సర్వే నెంబర్లు 20 ఏళ్ల క్రితం నాగుల గూడెం గ్రామానికి చెందిన 32 కుటుంబాలు అప్పటి ప్రభుత్వ ప్రజాప్రతినిధుల బలంతో ప్రభుత్వ భూమిలో స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్, మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. రోజువారి కూలీ చేసుకొని జీవనం సాగిస్తున్న వారి కుటుంబాల్లో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. అదే గ్రామానికి చెందిన ఓ రైతు ఆ కుటుంబాల వారిని బెదిరిస్తూ, ఇల్లు ఖాళీ చేయాలంటూ లేదంటే పెద్దలతో మాట్లాడి తానే ఖాళీ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ దళిత కుటుంబాల వారు బెదిరింపులను లెక్కచేయకుండా ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఇటీవల కాలంలో రెవెన్యూ అధికారులను పంపించి దళిత కుటుంబాలు ఇళ్ల నిర్మాణాలు చేసుకోకుండా అడ్డుకున్నారు. కనీసం మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపట్టనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో 32 దళిత కుటుంబాల వారు స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించి వారు గోడు విన్నవించుకుంటే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇల్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీతో సంతోషం వ్యక్తం చేసిన దళితుల కుటుంబాల్లో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. ఇటువలే కోర్టు నుంచి ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు రావడంతో గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తుంటే తాము కూడా ప్రభుత్వ భూమిలో 20 ఏళ్ల క్రితం నివాసాల ఏర్పాటు చేసుకున్నామని ఇప్పుడు ఆ నివాసాలకు ఖాళీ చేయమని నోటీసులు రావడం ప్రశ్నార్ధకమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళిత సామాజిక వర్గంలో ఉన్న కారణంగానే ఈ నోటీసులు పంపించారని అదే అగ్రవర్ణాలకు సంబంధించిన వారు మా స్థానంలో ఉంటే నోటీసులు వస్తాయా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అప్పటి ప్రభుత్వం హామీతోనే ఈ భూమిలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నామని, విద్యుత్తు మంచినీరు వసతులు కూడా కల్పించారని ఇటీవలే కాలం నుండి ఆ నివాసాలకు వెనుక వైపు ఉన్న ఓ రైతు తన పొలం ముందు దళిత కాలనీ ఏంటనే అహంకారంతో కావాలనే నోటీసులు రప్పించి ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. పదేళ్ల క్రితం ఈ కాలనీ అగ్ని ప్రమాదంలో ఖాళీ బూడిదైందని, అప్పటి ప్రభుత్వం స్పందించి ఇల్లు కాలిపోయిన వారికి పదివేల రూపాయలు ఆర్థిక నష్టం, నిత్యవసరాలైన బియ్యం సరుకులు పంపిణీ చేశాయని, సుమారు 32 ఇళ్లకు అప్పటి ప్రభుత్వం నష్ట పరిహారం అందించిందని. మరలా ఇప్పుడు ఇళ్ళను ఖాళీ చేయమని నోటీసులు వస్తే ప్రభుత్వం ఏమి పట్టనట్టు వ్యవహరించడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

న్యాయం చేయాలంటూ ఆవేదన

ప్రభుత్వం నుంచి తమకు ఇల్లు నిర్మిస్తామని హామీ పత్రాలు కూడా జారీ చేసినట్లు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సత్వర పరిష్కారం చేయాలని, లేకపోతే తమ 32 కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. ఇదే జరిగితే కుటుంబాల సమేతంగా ఆత్మహత్యలకు పాల్పడతామని వాపోతున్నారు.


Next Story