గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం... 98.5% హామీలను అమలు చేశాం : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్

by Disha Web Desk 21 |
గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం... 98.5% హామీలను అమలు చేశాం : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ అధికారంలోకి వచ్చిన 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి తీసుకొచ్చామని అలాగే పౌర సేవల్ని ఇంటింటికీ తీసుకెళ్లాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసులు, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శనను సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి సీఎం వైఎస్ జగన్ వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ..మువ్వన్నెల జెండా ఎగురుతోందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశం ఎంతో పురోగమించిందని... వ్యవసాయం, పరిశ్రమ,సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు.

రూ.2.31 లక్షల కోట్లు జమ చేశాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను మహిళల పేరున ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. రూ.2.31 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖతాలో నేరుగా జమ చేసినట్లు సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. గతంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదని.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పౌర సేవలను ఇంటింటికి తీసుకెళ్లగలిగామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు తెచ్చామని, 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చినట్లు సీఎం వైఎస్ జగన్ వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

రైతన్నకు అండగా నిలిచాం

గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రకటించారు. ఎలాంటి వివక్ష చూపించకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు సీఎం జగన్ ప్రజలకు వివరించారు. ఇకపోతే దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందిస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన సేవలను అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

అంటరానితనంపై యుద్ధం

సామాజిక న్యాయం నినాదంగా మిగిలిపోలేదని దాన్ని అమలు చేసి చూపించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలను విస్తరించామని చెప్పుకొచ్చారు.రాష్ట్రంలో అంటరానితనం మీద యుద్ధాన్ని ప్రకటించామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమేనని అభిప్రాయపడ్డారు. పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరానితనమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం జరుగుతుందని ప్రకటించారు. పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చామని.. 98.5 శాతం హామీలను అమలు చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి అందులో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసినట్లు తెలిపారు. అలాగే వైద్య, విద్యా, ఆరోగ్య వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని, నాడు-నేడుతో 45 వేల పాఠశాలల రూపు రేఖలు మార్చినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 2025 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని ప్రజలకు తెలియజేశారు. అలాగే వెలిగొండలో మొదటి టన్నెల్‌ పూర్తి చేశామని..రెండో టన్నెల్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పుకొచ్చారు. పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు.మూతపడిన చిత్తూరు డైరీని తిరిగి తెరిపించి జీవం పోశామని తెలిపారరు. భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టామని సీఎం వైఎస్ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వివరించారు.



Next Story

Most Viewed