Nitin Gadkari: ఏపీకి రూ.20 వేల కోట్లు కేటాయింపు

by Disha Web Desk 16 |
Nitin Gadkari: ఏపీకి రూ.20 వేల కోట్లు కేటాయింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023కు ముఖ్యఅతిథిగా హాజరైన నితిన్ గడ్కరీ దేశంలో ప్రముఖ రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పారు. ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ పారిశ్రామిక వృద్ధిలో రోడ్‌ కనెక్టివిటీ కీలకమన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని సూచించారు.

ఏపీకి రాబోతున్న మూడు పారిశ్రామిక కారిడార్లు

రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏపీలో రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఏపీలో మత్స్య పరిశ్రమ అత్యంత కీలకంగా మారిందని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు చేస్తామని.. అయితే 50-50 భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వీటితోపాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. పర్యావరణహిత వాహనాలదే భవిష్యత్ అని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. కాలుష్యాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

Next Story

Most Viewed