- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ | రేపు కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం
విశాఖపట్నం ఐటీ రంగంలో (Visaka IT Industry) పెను మార్పులకు వేదిక కానుంది. ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) తన కార్యకలాపాలను రేపు (డిసెంబర్ 12న) ప్రారంభించనుంది.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం ఐటీ రంగంలో (Visaka IT Industry) పెను మార్పులకు వేదిక కానుంది. ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) తన కార్యకలాపాలను రేపు (డిసెంబర్ 12న) ప్రారంభించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. కేవలం కాగ్నిజెంట్ కార్యకలాపాల ప్రారంభమే కాక పలు ప్రముఖ ఐటీ సంస్థల శాశ్వత కార్యాలయాల ఏర్పాటుకు కూడా భూమి పూజ రేపే నిర్వహించనుండడం విశేషం. ఈ కార్యక్రమానికి ఆయా సంస్థల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. ఈ పరిణామం వైజాగ్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఊతం ఇచ్చి, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను అందించనుంది.
కాగ్నిజెంట్కు సంబంధించి కాపులుప్పాడలో 22.19 ఎకరాల భూమి కేటాయించగా, రూ. 1,600 కోట్ల పెట్టుబడితో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ సెంటర్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 2029 నాటికి ఈ అత్యాధునిక క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. తాత్కాలికంగా రుషికొండ హిల్-2పై మహతి భవనం నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగ్నిజెంట్తో పాటు ఇతర కీలక ప్రాజెక్టుల వివరాలు చూస్తే.. రుషికొండ హిల్-2పై శ్రీటెక్ తమ్మిన ఏఐ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని ద్వారా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. అలాగే ఐటీ పార్క్ హిల్-4పై బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ సత్వ డెవలపర్స్ ఐటీ స్పేస్, డేటా సెంటర్ (వాంటేజ్ వైజాగ్ క్యాంపస్) ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు. ఈ సంస్థకు 30 ఎకరాలు కేటాయించగా రూ. 1,500 కోట్ల పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
కాపులుప్పాడ ఐటీ పార్కులో కాగ్నిజెంట్తో పాటు ఇమ్మాజినోటివ్, ఫ్లూయెంట్గ్రిడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా తమ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నాయి. విశాఖకు చెందిన ఫ్లూయెంట్గ్రిడ్ సంస్థకు 3.3 ఎకరాలు కేటాయించారు. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్కు 3.55 ఎకరాలు కేటాయించగా, వారు ఐటీ ఆర్అండ్డి సెంటర్ మరియు జీసీసీ (గ్లోబల్ కెపాసిటీ సెంటర్) ఏర్పాటు ద్వారా 700 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఇమ్మాజినోటివ్ సంస్థకు 4.05 ఎకరాలు కేటాయించగా, రూ. 140 కోట్ల పెట్టుబడితో జీసీసీ ఏర్పాటు కానుంది. ఈ భారీ పెట్టుబడులు, కార్యకలాపాల ప్రారంభంతో విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ మ్యాప్లో మరింత ప్రముఖ స్థానాన్ని దక్కించుకోనుంది, స్థానిక ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు ఇది ఒక కొత్త శకానికి నాంది పలికినట్టే.






