ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణం..ఆ కంపెనీకి రూ.75,706కోట్లు కట్టబెట్టిన జగన్: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

by Disha Web Desk 21 |
ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణం..ఆ కంపెనీకి రూ.75,706కోట్లు కట్టబెట్టిన జగన్: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
X

దిశ , డైనమిక్ బ్యూరో : అధికారంలోకి వచ్చినప్పటినుంచీ వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రతి స్కీమ్, ప్రతి ప్రాజెక్ట్ లోనూ స్కామ్ అవినీతేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి దోపిడీపై హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్ ఫార్మర్ల టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ట్రాన్స్ ఫార్మర్ల స్కామ్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేకరులకు వివరించారు.‘జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు దత్తపుత్రులు..వారిలో ఒకరు అరబిందో సంస్థ యాజమాన్యమైతే, మరొకరు షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని. ఈ రెండు సంస్థలకు పుట్టిన విషపుత్రికే ఇండో సోల్ సోలార్ సంస్థ. ఇండో సోల్ సోలార్ సంస్థ వయస్సు కేవలం 18 నెలలు మాత్రమే. ఆ సంస్థను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి అందుకు బహుమతిగా రూ.75,706 కోట్ల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టాడు’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ‘గతంలో తాము షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని బయటపెట్టామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు.

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబుపై నిందలు

2023లో తెలంగాణతో పోలిస్తే ఏపీలో ట్రాన్స్ ఫార్మర్ల ధరలు ఎక్కువ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 25 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్‍ ధర తెలంగాణలో రూ.79,829 అయితే ఏపీలో రూ.1,78,800 ధర అని చెప్పుకొచ్చారు. 63 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ ధర తెలంగాణలో రూ.1,22,936 అయితే ఏపీలో రూ.2,81,00 అని వెల్లడించారు. తెలంగాణ కంటే ఏపీలో 200 నుంచి 300 శాతం ఎక్కువ ధరకు ట్రాన్స్ ఫార్మర్లు అమ్మకాలు జరిగాయని అన్నారు. గత ఏడాది ధరలు చెబితే ఇప్పటికీ ధరలు పెరగవా అని అంటున్నారని మండిపడ్డారు. ఒక్క ఏపీసీపీడీసీఎల్‍లో వచ్చిన ఆర్డర్లలో 60 శాతానికి పైగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కేనని ఆరోపించారు. వచ్చిన ఆర్డర్లలో ఒక్క కంపెనీకే 60 శాతం కట్టబెడతారా? అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. సీపీడీసీఎల్ పరిధిలోని రూ.611.40కోట్ల విలువైన పనుల్లో రూ.380కోట్ల విలువైన(62.16శాతం) పనులు షిరిడీసాయి సంస్థకే అప్పగించడం వెనకున్న మర్మమేంటి? అని నిలదీశారు. జగన్ రెడ్డి...వైసీపీ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై మాట్లాడే ధైర్యం లేకే మంత్రులు, వైసీపీనేతలు టీడీపీపై, చంద్రబాబుపై నిందలేస్తున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed