పుంజుకున్న టమాటా ధరలు.. ఇక సామాన్యుడికి భారమేనా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-23 11:07:02  IST  )

మదనపల్లె టమాటా మార్కెట్లో టమాటా ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కేజీపై ఏకంగా రూ.13 పెరిగింది.

పుంజుకున్న టమాటా ధరలు.. ఇక సామాన్యుడికి భారమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా పేరుగాంచిన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాటా ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. గురువారం జరిగిన వేలంలో నాణ్యమైన టమాటా కిలో గరిష్టంగా రూ.38 వరకు పలికింది. గత వారం రోజులుగా రూ.25 లోపే ఉన్న ధరలు, ఇప్పుడు అకస్మాత్తుగా పెరగడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బి-గ్రేడ్ రకాలు రూ. 20 నుంచి రూ. 29 మధ్య అమ్ముడయ్యాయి. మదనపల్లె మార్కెట్‌కు రైతులు సుమారు 230 టన్నుల దిగుబడిని తీసుకురాగా, వ్యాపారులు సగటున రూ. 26 నుంచి రూ. 35 మధ్య కొనుగోలు చేసి ఇతర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో దిగుబడులు తగ్గడం వల్ల మదనపల్లె టమాటాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

ధరలు ఇలా అకస్మాత్తుగా పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలే. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో బయటి ప్రాంతాల్లో టమాటా తోటలు ఎండిపోయి, కాయ సైజు తగ్గి దిగుబడి దెబ్బతింది. స్థానిక మార్కెట్లలో సరఫరా తక్కువగా ఉండటంతో, పొరుగు రాష్ట్రాల వ్యాపారులు నాణ్యమైన సరుకు కోసం మదనపల్లె మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి టమాటా నాణ్యత బాగుండటం, నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో డిమాండ్‌కు తగ్గట్టుగా ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి.

మున్ముందు టమాటా ధరలు సామాన్యుడిపై భారం పెంచేలా కనిపిస్తున్నాయి. వాతావరణం చల్లబడకపోతే.. ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే, రానున్న రెండు మూడు వారాల్లో టమాటా కిలో ధర రూ.50 మార్కును సులభంగా దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లోనే రూ.38 పలుకుతుండటంతో, రిటైల్ మార్కెట్‌లో వినియోగదారులు అప్పుడే కిలో రూ.50 వరకు చెల్లించాల్సి వస్తోంది. సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసం పెరిగితే, గతేడాది లాగే టమాటా ధరలు మళ్ళీ ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Next Story