రామోజీ రావుకు మరోసారి సుప్రీం నోటీసులు.. నాలుగు వారాలే డెడ్‌లైన్!

by Disha Web Desk 2 |
రామోజీ రావుకు మరోసారి సుప్రీం నోటీసులు.. నాలుగు వారాలే డెడ్‌లైన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏళ్ల క్రితం సంచలనంగా మారిన మార్గదర్శి కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు ఆలస్యంగా ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. తెలంగాణ సీఎం కూడా మార్గదర్శి కేసులో పిటిషన్ దాఖలు చేయాలని కోరినట్లు ఉండవల్లి తెలిపారు. ఇంకోవైపు, రెండు నెలలు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఇంకా వకాలత్ దాఖలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా రెండు నెలల నుంచి పిటిషన్ దాఖలు చేయడం లేదని, ఎందుకు ఆలస్యం అయిందో అర్థం కావడం లేదని అన్నారు. ఖాతాదారుల నుంచి డిపాజిట్లు ఎంతోమంది తీసుకుంటున్నారని.. వారిని ఒక విధంగా, రామోజీరావును ఒక విధంగా చూడొద్దని కోర్టును కోరినట్లు ఉండవల్లి తెలిపారు. ఈ పిటిషన్ ద్వారా కేవలం డిపాజిట్లు తీసుకోవడం నేరమా? కాదా? అనేది మాత్రమే కోర్టును అడుగుతున్నామన్నారు. ఎవరెవరు డిపాజిట్లు చేశారో వారి పేర్లు అన్ని కూడా తన దగ్గర ఉన్నాయని ఉండవల్లి చెప్పారు. ఈ నేఫథ్యంలో మార్గదర్శి కేసులో రామోజీరావు చేసింది నేరమా కాదా అనే వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ప్రధాన పాత్రను పోషించనుంది. మరోవైపు రామోజీ రావు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.

రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ద్వారా రూ. 2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో రామోజీరావు సేకరించారని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు కూడా గతంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హెచ్‌యుఎఫ్ వ్యక్తుల సమూహం కాదని, ఆర్బీఐ నిబంధనలు వర్తించవని ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు జస్టిస్‌ రజిని రామోజీరావుపై కేసును కొట్టివేశారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Next Story