TDP vs YCP.. సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్న ప్రభుత్వ కేసులు..!

by GSrikanth |
TDP vs YCP.. సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్న ప్రభుత్వ కేసులు..!
X

కేసులు, కోర్టు తీర్పులంటే సామాన్యులు పెద్దగా ఆసక్తి చూపించరు. అదేదో అర్థంకాని బ్రహ్మ పదార్థంలా భావిస్తుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌తో మెజార్టీ ప్రజలు ఈ అంశాలపైనే దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం పెడుతున్న కేసులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. స్కిల్​డెవలప్​మెంటు స్కాం, ఏపీ ఫైబర్​నెట్, ఇన్నర్​రింగ్​రోడ్డు విషయాల్లో క్విడ్​ప్రొకో ఉందంటూ చంద్రబాబు, లోకేశ్​పై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇవన్నీ రాజకీయ కక్షతో పెట్టినవే తప్ప ఈ కేసుల్లో ఎలాంటి అవినీతికి తావులేదని టీడీపీ నేతలు పవర్​పాయింట్​ ప్రజంటేషన్లు ఇచ్చారు. వీటిపై అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. పథకాలను అమలు చేసిన అధికారులను తప్పించి, వాటిని రూపొందించిన విధానకర్తలపై కేసులు పెట్టడమేంటని సగటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో: స్కిల్​డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు రూ.241 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. షెల్​ కంపెనీల ద్వారా తను, తనకు సంబంధించిన వారి బ్యాంకు ఖాతాలకు మళ్లించుకున్నారని అభియోగం మోపింది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన వివరాల ప్రాతిపదికన కేసు పెట్టినట్లు సీఐడీ చెబుతోంది. సీమెన్​ కంపెనీతో చేసుకున్న ఒప్పందం కూడా బోగస్​ అని ఆరోపిస్తోంది. దీనిపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్​ పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. ఈ స్కీములో సీమెన్స్​ కంపెనీ నుంచి 90 శాతం పెట్టుబడి సాఫ్ట్​వేర్​ మాత్రమేనని పేర్కొన్నారు. డిజైన్​ టెక్​తో సహా మూడు పార్టీలతో ఒప్పందం చేసుకున్నట్లు పత్రాలు చూపారు. స్కిల్​ సెంటర్లు ఏర్పాటయ్యాయి. 2.30 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొంది 70 వేల మందికి పైగా ఉద్యోగాలు సాధించినట్లు భౌతికంగా కనిపిస్తోంది. ఇక అవినీతి ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సీఐడీ అభియోగం ప్రకారం చూసినా పథకాన్ని అమలు చేసిన అధికారులను తప్పించి విధాన నిర్ణేతలపై కేసులు ఎలా పెడతారని నిలదీస్తున్నారు. ఇది మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఫైబర్ నెట్ కథ కూడా సేమ్ టు సేమ్..

ఏపీ ఫైబర్ నెట్ పనులను బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి ఇచ్చి రూ.120 కోట్లు నొక్కేశారంటూ సీఐడీ కేసు పెట్టింది. ఇందులోనూ నాటి టీడీపీ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరించినట్లు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్​బాబు పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ద్వారా వివరాలు వెల్లడించారు. ఎక్కడికక్కడ మానిటరింగ్​ అధికారుల పర్యవేక్షణలోనే ఫైబర్​ నెట్​ ద్వారా అత్యంత చౌకగా రూ.140కే ఇంటర్​నెట్​ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలోనూ మానిటరింగ్ అధికారుల్లో ఏ ఒక్కరిపైనా కేసు నమోదు చేయలేదు. పథకాన్ని రూపొందించిన అప్పటి సీఎం చంద్రబాబుపై కేసు పెట్టడమేంటని నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.

రింగూ లేదు, రోడ్డూ లేదు..

ఇక అమరావతి ఇన్నర్​ రింగ్​ రోడ్డు విషయంలో క్విడ్​ ప్రొకో ద్వారా చంద్రబాబు, ఆయన తనయుడి కంపెనీ హెరిటేజ్​ ఫుడ్స్​ లబ్ది పొందినట్లు సిట్​అభియోగం మోపింది. రింగ్​రోడ్డు డిజైన్‌లో లింగమనేని రమేష్, రాజశేఖర్​ భూముల సమీపంలోకి వచ్చేట్లు చేశారని ఆరోపిస్తున్నారు. తద్వారా గెస్ట్​ హౌస్​చంద్రబాబుకు దక్కినట్లు సిట్​ కేసు నమోదు చేసింది. ఇందులో మాజీమంత్రి నారాయణకు ఆయాచిత లబ్ది చేకూరినట్లు కేసులో పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున టీవీ డిబేట్లలో అధికార పార్టీ నేతలు వాదనలు వినిపిస్తున్నారు.

క్విడ్ ప్రొకో ఎలా సాధ్యం?

వాస్తవానికి రింగు రోడ్డు డిజైన్​ అప్రూవల్​ దగ్గరే ఆగిపోయింది. దీని కోసం భూమి కేటాయింపులు జరగలేదు. ఈ రోడ్డు నిర్మాణం కోసం ఒక్క రూపాయి వెచ్చించలేదు. అసలు రింగు రోడ్డు నిర్మాణమే జరగలేదు. మరి క్విడ్​ ప్రొకో ఎలా సాధ్యమంటూ మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కేసులన్నింటిపై న్యాయ స్థానాల తీరు గురించి కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో న్యాయమూర్తులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు న్యాయవాద వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవి కూడా చదవండి : YCP ది 'పుష్ ఔట్.. పుష్ ఇన్' పాలసీ: Brahmani Nara ధ్వజం

Next Story