మహానాడు కార్యక్రమానికి భారీగా తరలివస్తున్న టీడీపీ శ్రేణులు

by Yella Dhawani Reddy |

మహానాడు ప్రాంగణానికి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు.

మహానాడు కార్యక్రమానికి భారీగా తరలివస్తున్న టీడీపీ శ్రేణులు
X

దిశ, డైనమిక్​ బ్యూరో: మహానాడు ప్రాంగణానికి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. మ‌హానాడు ప్రాంగ‌ణం వ‌ద్ద మేళ‌తాళాలు, మంగ‌ళ‌వాద్యాల‌తో పార్టీ శ్రేణుల‌కు ఆహ్వానం పలుకుతున్నారు. జాన‌ప‌ద క‌ళాకారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. సింగ‌ర్ ర‌మ‌ణ బృందం పాటలతో అలరిస్తోంది. ఎన్టీఆర్ వేష‌ధార‌ణ‌లో టీడీపీ అభిమాని ఆకట్టుకున్నారు. తిప్పర మీసం, ఇది ఆంధ్రుడి రోషం .. రా ర‌మ్మని పిలుస్తోంది తెలుగుదేశం పాట‌కు సినీ కొరియోగ్రాఫ‌ర్ స‌త్యా మాస్టర్​బృందం డ్యాన్స్​ ప్రదర్శించింది. మ‌హానాడు వేదిక పైకి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మ‌హానాడు వేదికపైన ఉన్న ప్రతినిధులకు సీఎం అభివాదం, క‌ర‌చాల‌నం చేశారు. మ‌హిళా నేత‌ల పాదాభివంద‌నాలను చంద్రబాబు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయ‌క‌త్వం, లోకేష్ నాయ‌క‌త్వం వ‌ర్థిల్లాల‌ని నినాదాలు మార్మోగాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడును ప్రారంభించారు.

నిఘానీడ‌లో మ‌హానాడు

ప్రధాన వేదిక వద్ద నుంచి పది కిలోమీటర్ల వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది పోలీసుల‌తో భారీ బందోబ‌స్తు నిర్వహిస్తున్నారు. మ‌హానాడుకు సుమారు 7 లక్షల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అంచనా వేస్తున్నారు.

Next Story