టీడీపీ దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుంది: మంత్రి బుగ్గన

by Disha Web Desk 21 |
టీడీపీ దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుంది: మంత్రి బుగ్గన
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజదొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు ఉంది అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ.2000 కోట్లు అప్పు తెచ్చుకుందని టీడీపీ ఆరోపణలు ముమ్మాటికి అబద్దం అన్నారు. దోచుకోవడానికే ఇలా చేశారని వితండవాదం చేశారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో కనీస అవగాహన లేకుండా మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్‌లో రూ.241 కోట్లు దోచుకుందెవరు? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? అని బుగ్గన నిలదీశారు. ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? సామాన్య ప్రజలలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ప్రజలకు స్పష్టమవుతుంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

పర్మిషన్ మాత్రమే గ్యారంటీ కాదు

వైసీపీ ప్రభుత్వం మెగా సంస్థకు ఇచ్చిన పర్మిషన్ గవర్నమెంట్ గ్యారంటీ కాదు అని బుగ్గన తెలిపారు. బ్యాంక్‌లు ఆ ప్రైవేట్ సంస్థ యొక్క విశ్వసనీయత ఆధారంగానే లోన్ లు ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం కేవలం ప్రైవేట్ సంస్థకు బకాయిలు ఎన్ని ఉన్నాయి అని వివరాలు ఇవ్వడం జరిగింది... కుదిరితే వాటిని ఏ సమయంలో చెల్లించడం జరుగుతుందో సూచించడం జరిగింది అని చెప్పుకొచ్చారు. మేఘా సంస్థ కు ఇచ్చింది ప్రభుత్వ గ్యారంటీ కానే కాదు. ఈ ఒక్క అనుమతి కూడా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినది. అందులోనూ పోలవరం నిర్మాణాన్ని అతి త్వరగా పూర్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరంపై చేసిన తప్పులే ప్రస్తుత పరిస్థితులకు కారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.


మీ బకాయిలను మేం చెల్లిస్తే మాపై నిందలా?

టీడీపీ పాలనలో ఆరోగ్య శ్రీ కింద 1,059 జబ్బులు ఉన్నప్పుడు రూ.800 కోట్లు పై చిలుకు చివరి 8 నెలల నుండి పెండింగ్ లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఇచ్చారా ? అని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నిలదీశారు. టీడీపీ హయాంలో పెట్టిన బకాయిలను సైతం వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సామర్థ్యం పెంచి 3,257 (ఈ ప్రభుత్వంలో 2,198 అదనంగా చేర్చడం జరిగింది) జబ్బులకు విస్తరించి సరిహద్దు రాష్ట్రాలలోని 204 హాస్పిటళ్లలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తూ పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాం అని బుగ్గన తెలిపారు. టీడీపీ ఐదేళ్లకాలంలో రూ.5,177 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని అదే వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే రూ.9,514.84 కోట్లు ఆరోగ్యశ్రీకి వెచ్చించిందని తెలిపారు.టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి రూ.40000 కోట్లు పెండింగ్ పెడితే..ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చెల్లించింది అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed