రైతుకు అండగా...బాధితులతో సానుభూతిగా వ్యవహరించండి: సీఎం వైఎస్ జగన్

by Seetharam |
రైతుకు అండగా...బాధితులతో సానుభూతిగా వ్యవహరించండి: సీఎం వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించండి అని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. బాధితుల స్ధానంలో మనం ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సాయం వారికి అందాలి అని ఆదేశించారు. రూ.10 ఎక్కువ ఖర్చు అయినా.. బాధితులకు మంచి సహాయం అందాలని... ఆ దిశగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి ఒక్కరి నోటా.. ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్‌ బాగా చేశాడన్న మాట వినిపించాలి. వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలి. పరిహారం అందించడంలో సానుభూతితో ఉండండి అని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తుఫాను ప్రభావం, చేపడుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉన్నతాధికారులు పలు వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ...వర్షాల నుంచి తెరిపి వచ్చింది. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుఫాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు స్పెషల్‌ ఆఫీసర్లుగా క్షేత్రస్ధాయిలో మంచిగా పనిచేశారు అని అన్నారు. అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలి. చిన్న చిన్న విషయాల మీద ధ్యాస మిస్‌ కాకుండా చూసుకోవాలి అని సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.


సాయంలో లోటు రాకూడదు...

‘వర్షాల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10వేలు ఇచ్చే విషయంలోనూ, వర్షాలు కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని క్యాంపులకు తీసుకొచ్చి వారిని చూసుకునే విషయంలోనూ, క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లున్న సందర్భంలోనూ వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రేషన్‌ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని అన్నారు. మరోవైపు పంటపొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలి అని సూచించారు. అన్ని రకాల మానవ వనరులను దీనిపై పెట్టండి. ధ్యాసంతా ఇక్కడే పెట్టాలి. ఇది అత్యంత ప్రాధాన్య అంశం. పంటల సంరక్షణకు ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఎస్‌ఓపీ ఇప్పటికే జారీ చేశారు అని చెప్పుకొచ్చారు. ‘రైతులకు కచ్చితమైన భరోసా ఇవ్వండి. ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా నిలబడుతుంది. వారు అధైర్య పడాల్సిన పనిలేదు. పంటల రక్షణ, పంటలకు పరిహారం అందించడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్ని రకాలుగా రైతుకు ప్రతి అడుగులోనూ తోడుగా ప్రభుత్వం ఉంటుంది. 80శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకూ అన్ని రకాలుగా సిద్ధం కావాలి’ అని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.


కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30లక్షలు సాయం

‘యుద్ధ ప్రాతిపదికన అత్యధిక ప్రాధాన్యతతో విద్యుత్‌ను పునరుద్ధరించాలి.రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకొండి’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టండి అని సూచించారు. ‘మేమందరం మీకు తోడుగా ఉన్నాం. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొండి. దురదృష్టవశాత్తూ విధి నిర్వహణలో ఉండగా చెట్టుకూలి కానిస్టేబుల్‌ చనిపోయాడు. ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షలు సాయం అందిస్తాం. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్ధైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది’ అని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు.

ఉద్యోగుల స్ధైర్యం నిలబడేలా...

గ్రామాల్లో ఉన్న వాలంటీర్‌ దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది మొదలుకుని, ప్రభుత్వంలో పై స్ధాయిలో ఉన్న ఉద్యోగి వరకు ఎలాంటి ఇబ్బంది జరిగినా.. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed