యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ.. పట్టించుకోని అధికారులు

by Dishanational2 |
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ.. పట్టించుకోని అధికారులు
X

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. జగనన్న లేఔట్లలో సైతం నాణ్యమైన ఇసుక లేక తువ్వ ఇసుకనే నిర్మాణాలకు వాడుతున్నారు. అవసరానికి మేర ఇసుక ఉన్నా.. దళారులు ఇతర రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకోవడంతో కృత్రిమ కొరత ఏర్పడుతుంది.

దిశ, బుచ్చిరెడ్డిపాళెం: రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇసుక మాఫియాను అరికట్టాలనే ఉద్దేశంతో నూతన ఇసుక పాలసీ విధానం తీసుకువచ్చింది. సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా ఇసుక బుక్‌ చేసుకుంటే, వాహనాన్ని నేరుగా ఇంటికి పంపేవారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కాగులపాడు, జొన్నవాడ వద్ద ఉన్న ఇసుక రీచ్‌లలో జేపీ లాంటి సంస్థలకు అప్పగించింది. ఆ సంస్థ ఇసుక పాలసీకి విరుద్ధంగా త్రవ్వకాలు జరిపి ఇతర రాష్ట్రాలకు విచ్చలవిడిగా తరలిస్తున్నారు.

జగనన్న ఇళ్ల నిర్మాణంలో తువ్వ ఇసుక

జగనన్న లే ఔట్లలో నాణ్యమైన ఇసుక లేక తువ్వ ఇసుకనే వాడుతున్నారు. దీనివల్ల గృహ నిర్మాణాల్లో పగుళ్లు ఏర్పడటం బెస్మెంట్ సరిగ్గా లేక కుంగడం, సిమెంట్, కంకర, నాసిరకం ఇసుకతో సరిగా కలవక పెచ్చులూడటం వంటి సమస్యలు లబ్దిదారులు ఎదుర్కొంటున్నారు.

నిబంధలకు విరుద్ధంగా తవ్వకాలు

గనుల శాఖ ఉత్తర్వుల మేరకు ఇసుకను మీటర్ లోతుకంటే ఎక్కువ తవ్వరాదు. ఒకవేళ జరిపినట్లయితే భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావాలు సంభవిస్తాయి. వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది. ఇసుక కోతకు గురయ్యి నీటి మట్టం తక్కువగా ఉంటుంది కాబట్టి నీరు సహజంగా ప్రవహించదు. జేపీ సంస్థ ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తున్న దాఖాలాల్లేవు. బుచ్చిరెడ్డిపాళెం కాకులపాడులో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story