ప్రతి దశలోనూ జాగ్రత్త: SIRపై నేతలకు సజ్జల దిశానిర్దేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-18 12:40:59  IST  )

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్‌ 15 నుంచి ప్రారంభం కానుందని వైఎస్సార్సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్‌ఐఆర్‌పై వైఎస్సార్సీపీ నియమించిన పార్లమెంటరీ పరిశీలకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు..

ప్రతి దశలోనూ జాగ్రత్త: SIRపై నేతలకు సజ్జల దిశానిర్దేశం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్‌ 15 నుంచి ప్రారంభం కానుందని వైఎస్సార్సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్‌ఐఆర్‌పై వైఎస్సార్సీపీ నియమించిన పార్లమెంటరీ పరిశీలకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ జూన్‌ 15 నుంచి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని, అనంతరం జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అవుతుందని చెప్పారు. ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారని సజ్జల వివరించారు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ కొనసాగే ఈ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అత్యంత కీలకమని, అందుకే ఈ వ్యవహారంపై పార్టీ తరఫున ఏర్పాటు చేసిన కమిటీలు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలన్నారు. సెప్టెంబర్‌ వరకూ ప్రతి దశలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని సజ్జల సూచించారు.

బీఎల్ఏలదే కీలకపాత్ర

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కీలకపాత్ర పోషిస్తారని సజ్జల పేర్కొన్నారు. బీఎల్‌వోలు, బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలని, ఈలోపు బీఎల్ఏలకు అవసరమైన ఓరియెంటేషన్‌, శిక్షణ ఇవ్వాలని సూచించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డ్రాఫ్ట్‌ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవని సజ్జ చెప్పారు.

ఎన్యూమరేషన్‌ పత్రాలు వచ్చేలోపే సిద్ధంగా ఉండాలి..

ఎన్యూమరేషన్‌ పత్రాలు వచ్చేలోగానే బీఎల్ఏలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఓటర్లకు సంబంధించిన అన్ని ఆధార పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకునేలా ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు. అంతేకాక ఇప్పుడు జరుగుతున్నది స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కాబట్టి ఒకసారి ఓటు తొలగిస్తే మళ్ళీ చేర్చడం కష్టమవుతుందన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. దీంతోపాటు ఎన్యూమరేషన్‌ ఫామ్‌ ఇస్తేనే ఓటు ఉంటుందని లేదంటే ఉండదన్న సంగతిని కూడా ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్‌ వరకు ఈ ప్రక్రియలో పనిచేసే అన్ని టీమ్‌లు అప్రమత్తంగా ఉండాలని, పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు కూడా నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు.

బీఎల్ఏలకు తప్పకుండా గుర్తింపు

బూత్ లెవల్ ఏజెంట్లు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆయా బూత్‌ల బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, సమర్థంగా పనిచేసే బీఎల్ఏలకు రాబోయే రోజుల్లో పార్టీ తగిన గుర్తింపు తప్పకుండా ఇస్తుందని పేర్కొన్నారు. జూన్‌ 15న ఎస్‌ఐఆర్‌ ప్రారంభమయ్యేలోపు మరోసారి సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణపై సమగ్రంగా చర్చిద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Next Story