పులివెందులలో రెండో రోజు సజ్జల భార్గవరెడ్డి విచారణ.. మార్ఫింగ్ ఫొటోలపై పోలీసుల ఆరా!

by Naga Rani Yarlagadda |

పులివెందులలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం బాధ్యుడు సజ్జల భార్గవరెడ్డిపై పోలీసుల విచారణ రెండో రోజుకు చేరింది.

పులివెందులలో రెండో రోజు సజ్జల భార్గవరెడ్డి విచారణ.. మార్ఫింగ్ ఫొటోలపై పోలీసుల ఆరా!
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం బాధ్యుడు సజ్జల భార్గవరెడ్డిపై పోలీసుల విచారణ రెండో రోజుకు చేరింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యుల ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు భార్గవరెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో నిన్న సుమారు 8 గంటల పాటు ఆయనను విచారించిన పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, ఇవాళ మధ్యాహ్నం మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

టెక్నికల్ సాక్ష్యాలపై దృష్టి

ఈ విచారణలో సివిల్ పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ నిపుణులు కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మార్ఫింగ్ చిత్రాలు, అశ్లీల కంటెంట్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఆ చిత్రాలను ఎక్కడ తయారు చేశారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా భార్గవరెడ్డి వినియోగించిన సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విచారణ పారదర్శకంగా ఉండేందుకు పోలీసులు పూర్తి ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. నిన్నటి సెషన్‌లో దాదాపు 70 ప్రశ్నలు సంధించగా, నేడు కూడా అదే స్థాయిలో కీలక ప్రశ్నలను పోలీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ విచారణ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

Next Story