అక్కమ్మ ఆలయానికి ఆదరణేది?

by Dishanational2 |
అక్కమ్మ ఆలయానికి ఆదరణేది?
X

దిశ, కళ్యాణదుర్గం: రాజులు పోయారు.. రాజ్యాలు మారాయి.. అయినా కూడా అనంతపురం జిల్లా కంబదూరులోని 10 వ శతాబ్దంలో నిర్మితమైన పురాతన అక్కమ్మ ఆలయం, బసవన్న ఆలయాలు పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఎంతోమంది రాజకీయ నాయకులు అధికారం చేపట్టినప్పటికీ శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు నిధులు కేటాయించలేదని ప్రజలు వాపోతున్నారు. ఈ ఆలయంలో ఒక గర్భగుడి, రెండు ద్వారాలు ఉన్నాయి. వాటితోపాటు ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఈ ఆలయాన్ని ఎవరు చూసినా ఎంతో అద్భుతంగా ఉంటుందని కొనియాడుతారు.

ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యులు నిర్మించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయం పక్కనే జైన మతస్తులు నిర్మించిన బసవన్న ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రముఖ జైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అయినా కూడా ఈ రెండు ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడం గమనార్హం. హిందూ దేవాలయం పక్కనే జైన శిల్పాలతో కూడిన ఒక దేవాలయం ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. దాదాపు 1000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని చూడడానికి, పునరుద్దించడానికి అధికారులు ఎవరూ రాకపోవడం బాధాకరమని ప్రజలు పేర్కొన్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలోకి వచ్చే ఈ ఆలయానికి సంబంధించి నిధులు తీసుకుంటున్నారే తప్ప అభివృద్ధి మాత్రం చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి సనాతన పురాతన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. రాజులు మనకు ఇచ్చిన ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని, ఇప్పటికైనా పర్యాటక శాఖ మంత్రి కళ్లు తెరిచి చూడాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed