ఇకపై ఏపీలో ఏసీ పల్లె వెలుగు బస్సులు

by Thanuru Gopichand |

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పల్లె వెలుగు సర్వీసుల కోసం ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను (Electric City Buses) నడపనున్నట్లు పేర్కొంది.

ఇకపై ఏపీలో ఏసీ పల్లె వెలుగు బస్సులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పల్లె వెలుగు సర్వీసుల కోసం ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను (Electric City Buses) నడపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఆర్టీసీపై నిర్వహించిన సమీక్ష (RTC Review Meeting) సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలను అధికారులకు జారీ చేసింది. ఇకపై కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు పల్లె వెలుగు కోసమైనా తప్పనిసరిగా ఏసీవి అయ్యుండాలని స్పష్టం చేశారు. అదే విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,450 కొత్త ఈవీ బస్సులు కొనుగోలు చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని అన్నారు. అందుకు సంబంధించిన టెండర్లను త్వరలోనే ఆహ్వానించాలని అధికారులకు తెలిపారు.

రానున్న ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశ పెట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న బస్సులను ఈవీలుగా మార్పిడి చేయాలని నిర్దేశించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలన్నారు. స్త్రీ శక్తి – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తలెత్తిన రద్దీకి తగినట్టుగా నూతన బస్సులు ప్రవేశపెట్టాల్సి ఉందని అధికారులకు సూచించారు.

దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు

రాష్ట్రంలో 2030 నాటికి దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను భర్తీ చేయాల్సి ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలో పర్యావరణహితమైన ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. దశలవారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తద్వారా సంస్థపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా కాలుష్య నియంత్రణలో సంస్థ భాగమవుతుందని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్నారు. రైల్వే శాఖ తరహాలో కార్గో రవాణాపై ఏపీఎస్ఆర్టీసీ ఫోకస్ పెట్టాలని అధికారులకు తెలిపారు. బస్ స్టాండ్ ల ద్వారా సంస్థకు ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలన్నారు.

పీఎం ఈ బస్ సేవా పథకం కింద

పీఎం ఈ బస్ సేవా పథకం కింద 750 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం రాష్ట్రానికి అందిస్తోందని, తిరుమల–తిరుపతికి మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని అధికారులు సీఎంకు తెలిపారు. థింక్ గ్యాస్ సంస్థ భాగస్వామ్యంతో చిత్తూరు నుంచి వెల్లూరు మార్గంలో నడిపే డీజిల్ బస్సులను సీఎన్జీగా మార్చే పైలట్ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైందని అధికారులు వెల్లడించారు.

Next Story