సొమ్ములుంటేనే టిక్కెట్లు..!! గోదావరి జిల్లాల్లో నయా ట్రెండ్

by Disha Web Desk 6 |
సొమ్ములుంటేనే టిక్కెట్లు..!! గోదావరి జిల్లాల్లో నయా ట్రెండ్
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: అభ్యర్థుల ఎంపికలో దివంగత నందమూరి తారక రామారావు సీట్ల ఎంపికలో ఒక పద్ధతిని అనుసరించేవారట. అప్పట్లో సూటు కేసులకు ప్రాధాన్యమిచ్చే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయానికి బ్రేక్ వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలకు జనమోద ముద్ర వేశారు. దీంతో చాలా చోట్ల సాదా సీదా వ్యక్తులు, ప్రజా నాయకులు, ఉద్యమ కారులు, విద్యావంతులు శాసన సభకు వెళ్లారు. మంత్రులు ఎంపిక కూడా అదే రీతిలో ఉండేది. గుణగణాలు, విద్యా ప్రమాణాలు ఆదారంగా కేబెనెట్‌లోకి తీసుకొనే వారు. అలా, సాధారణ వ్యక్తి చిక్కాల రామచంద్రరావు, దివంగత జీఎంసీ బాలయోగి తదితరులు మంత్రులు, స్పీకర్లు అయ్యారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. సీటు ఆశిస్తున్న వ్యక్తికి ఎంత పలుకుబడి ఉన్నా సరే గట్టిగా సొమ్ములు ఉండి తీరాలి. సర్వేలో కాస్త అటు ఇటుగా ఉన్నా అతనికి సీటు ఖాయం. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ విధానం నడుస్తుండటంపై దిశ అందిస్తున్న కథనం.

కాకినాడ పార్లమెంటులో..

కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరుపున సానా సతీష్‌కు సీటు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కాగా, నియోజకవర్గంలో జగ్గంపేట మాజీ శాసన సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. జనంలో కాస్త పేరు సంపాదించుకున్నారు. కానీ, సానా సతీష్ పేరు ఖాయమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సీట్ల ఎంపిక ప్రక్రియ ఇంకా ఆరంభం కాకపోయినా, సతీష్ పేరు మాత్రం అదిష్టానం సూచనప్రాయంగా లీక్ చేస్తుంది. ఇందుకు సతీష్ వద్ద నిండుగా సొమ్ములు ఉండటమేనన్నది ప్రధాన కారణం. విద్యుత్ శాఖలో ఆయన ఉద్యోగిగా సేవలు అందించారు. పార్టీకి మంచి ఫండ్ ఇస్తారని అంటున్నారు. దీంతో అతను ఎవరికీ పరిచయం లేకపోయినా పార్లమెంటు స్థానానికి ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.

కాకినాడ సిటీ అయోమయం..

కాకినాడలో వైసీపీ నుంచి శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన స్థితిమంతుడు. అంతేగాక, ఆయన అనుచరులకు ఆర్థికంగా గట్టి తోడ్పాటునిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గట్టిగా సొమ్ములు వెచ్చిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈయనకు ధీటుగా స్థానిక టీడీడీ ఇన్చార్జి వనమాడి వెంకటేశ్వర రావు కూడా ఉన్నారు. ఈయన రెండు పర్యాయాలు శాసన సభ్యునిగా సేవలందించారు. సొమ్ములు బాగానే ఉన్నాయని ప్రచారం సాగుతుంది. కానీ ఖర్చుకు వెనుకాడతారని అంటున్నారు. ఇది తాజా పరిస్థితులకు సరిపోలేదు. ఈ నేపథ్యంలో క్షత్రియ కోటా నుంచి మరో వ్యక్తిని రంగంలోకి దించాలని పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.

ప్రత్తిపాడులో..

దివంగత వరుపుల రాజా శ్రీమతి సత్యప్రభకు ప్రత్తిపాడులో ఇన్చార్జి బాధ్యతలు అప్పచెప్పారు. ఇటీవల ఆమె వైసీపీ లోకి వెళ్తుందనే పుకార్లు వచ్చాయి. వాటిని ఆమె తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో బారీ ర్యాలీ చేపట్టారు. దీనికి జనం నుంచి మంచి స్పందన వచ్చింది. టీడీపీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ ఆమె వద్ద సొమ్ములు లేవు. దీంతో పార్టీ అధిష్టానం అదే నియోజకవర్గంలో ధర్మవరం గ్రామానికి చెందిన ముదునూరి మురళీ కృష్ణం రాజును రంగంలోకి దింపారు. సత్యప్రభకు అయ్యే ఖర్చంతా ఆయన భరించాల్సి ఉంటుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీ కృష్ణం రాజుకు మంచి పదవి ఇచ్చే ఆలోచనలో పార్టీ ఉంది. ఆయన గతంలో వైసీపీ సీటు ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత టీడీపీ అక్కున చేర్చుకుంది. సత్యప్రభను గెలిపిస్తే మంచి పదవి దక్కే అవకాశం ఉంది.

Also Read..

Chandrababu: రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది


Next Story

Most Viewed