శ్రీవారి సేవలో ముద్దాడ రవిచంద్ర.. టీటీడీ నూతన ఈవోగా బాధ్యతల స్వీకరణ

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-06 07:50:57  IST  )

టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.

శ్రీవారి సేవలో ముద్దాడ రవిచంద్ర.. టీటీడీ నూతన ఈవోగా బాధ్యతల స్వీకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO)గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన తొలుత క్షేత్ర సంప్రదాయం ప్రకారం భూవరాహ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారం దర్శనం అనంతరం ఆలయంలో బంగారు వాకిలి వద్ద టీటీడీ బోర్డు ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ముద్దాడ రవిచంద్రతో ప్రమాణం చేయించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముద్దాడ రవిచంద్రకు శ్రీవారి తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని కూడా అందజేశారు.

ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తులు కొలిచే శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. సామాన్య భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దర్శన ఏర్పాట్లలో మరింత పారదర్శకత తీసుకువస్తామని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు ముద్దాడ రవిచంద్ర ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Next Story