లారీ బోల్తా.. కాల్వ నీటిలోకి రసాయన వ్యర్థాలు

by Thanuru Gopichand |

ఫార్మా కంపెనీ కారణంగా నీటి కాలుష్యంపై అనుమానాలు.

లారీ బోల్తా.. కాల్వ నీటిలోకి రసాయన వ్యర్థాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ (Kakinada) జిల్లాలోని తొండంగి మండలం ఎ.వి.నగరం శివారులో ఓ ఫార్మా కంపెనీకి (Pharma Company) చెందిన లారీ బోల్తా (Lorry Accident) కొట్టింది. రసాయన వ్యర్థాలతో వెళ్తున్న అది కాస్త అదుపు తప్పి పంట కాల్వలో పడింది. లారీలోని రసాయన వ్యర్థాలు కాల్వ నీటిలో కలిశాయి. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ పంట కాల్వపై పంపింగ్ స్కీమ్ ఆధారపడి ఉందన్నారు. పలు గ్రామాలకు కాల్వ ద్వారానే సాగు, తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. రసాయన వ్యర్థాల కారణంగా నీరు విషతుల్యం అయ్యే ప్రమాదం ఉందని గుర్తించామన్నారు. అందుకే ప్రవాహ దిశలోని గ్రామాల వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఎవరూ కూడా కాల్వ నీటిని తాగకూడదని, ఇంటి అవసరాలకు వినియోగించకూడదని సూచించారు. అదే విధంగా సమీప చెరువులకు కూడా రసాయన వ్యర్థాలు నీటితోపాటు చేరే ప్రమాదం ఉందన్నారు. తాత్కాలికంగా కాల్వ నీటికి వాటిల్లోకి వెళ్లకుండా మళ్ళించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

విషయం తెలుసుకున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu), స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య (Yanamala Divya) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే బాధిత గ్రామాల ప్రజలకు సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. తాగునీటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. రంగంలోకి దిగిన నిపుణులు నీటి శుద్ధికి చర్యలు చేపట్టారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అయితే ఆ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story