పిఠాపురంలో స్థానిక ఎన్నికలను తలపించేలా సందడి.. అసలేం జరిగిందంటే?

by Gantepaka Srikanth |

పిఠాపురంలో స్థానిక ఎన్నికలను తలపించేలా సందడి.. అసలేం జరిగిందంటే?

పిఠాపురంలో స్థానిక ఎన్నికలను తలపించేలా సందడి.. అసలేం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం(Pithapuram) నియోజకవర్గంలో జనసేన కమిటీల నియామకం ప్రజాస్వామ్యబద్ధంగా, ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న జనసైనికులకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ, నవ నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా చేబ్రోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో గత మూడు రోజులుగా కమిటీల నియామక కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలే నాయకులను ఎన్నుకుంటూ, కమిటీల నియామకం స్థానిక ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా ఉత్సాహంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో గురువారం ఎండపల్లి, విరవ, విరవాడ, మంగుతుర్తి, ఎఫ్.కే. పాలెం, వన్నెపూడి, కొడవలి, LN పురం, P. తిమ్మాపురం, దుర్గాడ, మాధవాపురం, కోలంక, చిన్న జగ్గంపేట, చెందుర్తి, B. ప్రత్తిపాడు గ్రామాలకు కమిటీలను ఓటింగ్ విధానం ద్వారా ఎంపిక చేశారు. అర్థరాత్రి ఒంటిగంట వరకు సాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 174 వార్డులకు, 48 బూత్‌లకు, 15 గ్రామాలకు ఇంచార్జులను ఎన్నుకున్నారు. దీంతో ఈ మూడు రోజుల్లో మొత్తం 28 పంచాయతీల పరిధిలో 294 వార్డులకు, 86 బూత్ లకు, 28 పంచాయతీ ఇంచార్జులతో కమిటీలు ప్రకటించారు.

ఎన్నికైన సభ్యులకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ నియామక పత్రాలు అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. మిగిలిన గ్రామాలకు కూడా ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఇదే విధంగా కమిటీల నియామకం కొనసాగుతుందని, శనివారంతో ఈ నియామకాల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.

Next Story