Kurnool: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్లు ఇవ్వాలి

by Disha Web Desk 16 |
Kurnool: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్లు ఇవ్వాలి
X

దిశ, కర్నూలు ప్రతినిధి: జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) జాతీయ సమితి సభ్యులు కే.నాగరాజు, కొండప్ప, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా గౌరవ సలహాదారులు వైవీ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.ఎన్.రాజు, కే.శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి, ఉపాధ్యక్షుడు దస్తగిరి, సహాయ కార్యదర్శి అవినాష్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పౌర సంబంధాల, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) జయమ్మ ను కలసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కేంద్రంగా రెగ్యులర్ పేపర్స్‌తో పాటు చానల్స్, చిన్న పేపర్స్, పీడీఎఫ్ పేపర్స్ వెలువడుతున్నాయన్నారు. అయితే 3 లక్షలకు పైగా సర్క్యులేషన్(సీఏ) ఉంటేనే మండలానికి ఒక అక్రిడేషన్ ఇవ్వాలని జీఓ ఇవ్వడం బాధాకరన్నారు. దీనివల్ల రెగ్యులర్ పేపర్స్‌లో పని చేసే మండల రిపోర్టర్స్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కనుక ఈ నిబంధనను తొలగించి గతంలో మాదిరి 75 వేల నుంచి 3 లక్షల వరకు సర్క్యులేషన్ ఉన్న రెగ్యులర్ పేపర్స్‌కు మండలానికి ఒక అక్రిడేషన్ ఇవ్వాలని కోరారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కు పాత జిల్లా కేంద్రంతో పాటు కొత్త జిల్లా కేంద్రంలో కూడా నాలుగు అక్రిడేషన్లు ఇవ్వాలన్నారు. ఎంప్యానాల్ ఉండి రెగ్యులర్ గా వస్తున్న చిన్న పేపర్స్ కు నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ ఇవ్వాలన్నారు. పీడీఎఫ్ పేపర్స్ కు అటెండెన్స్ తో సంబంధం లేకుండా గతంలో మాదిరి 3 నెలల పేపర్స్ ప్రింటింగ్ తెచ్చి ఇచ్చిన వారికి జిల్లాకు రెండు అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రిపోర్టర్స్ అందరికీ న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు శ్రీనాథ్ రెడ్డి, శీను, శశి తదితరులు పాల్గొన్నారు

Next Story

Most Viewed