Tiger: తల్లి పులి కనిపించి..మాయమై

by Disha Web Desk 16 |
Tiger: తల్లి పులి కనిపించి..మాయమై
X

దిశ, కర్నూలు ప్రతినిధి: నల్లమల అభయారణ్య ప్రాంత పరిధిలోని ఓ మారుమూల ప్రాంతంలో తల్లిపులి కోసం అటవీ అధికారులు, సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. పెద్దపులి ఆనవాళ్లు కన్పించకపోవడంతో అటు అటవీ అధికారులు, ఇటు జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పులి కూనలను తల్లి చెంతకు చేర్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తు్న్నారు. అందుకోసం ప్లాన్-ఎను అమలు చేస్తున్నారు. ఇప్పటికే తల్లిపులి ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలో 200 కిలోమీటర్ల మేర ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ వీటి ఆనవాళ్లు కన్పించినా వాటి చెంతకు చేర్చేందుకు అటవీశాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని నీలగిరి మొక్కల ప్లాంటేషన్‌లో కన్పించిన తల్లి పులి గొర్రెలకాపరుల అరుపులు, కేకలకు భయపడి మళ్లీ అడవిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు పులి కూనలతో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. తల్లిపులితో పిల్లలను కలుపుతారా? లేక మళ్లీ అన్వేషణ తప్పదా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.


పెద్ద గుమ్మడాపురం శివారులో 4 పులి కూనలు లభ్యం

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అభయారణ్య ప్రాంత పరిధి పెద్ద గుమ్మడాపురం గ్రామం శివారులో 4 పులి కూనలు లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కూనలను తల్లిపులి చెంతకు చేర్చేందుకు అటవీశాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడ్రోజులుగా తల్లి పులి కోసం పులి కూనలు తల్లడిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో కూనలను తల్లి చెంతకు చేర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా వాటి ఆనవాళ్లు కన్పించకపోవడంతో అటవీ అధికారులు, ఇటు జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. రోజులు గడిచే కొద్దీ తల్లిపులి తన పిల్లలను మరచిపోయే ప్రమాదం ఉండడంతో అటవీ అధికారులు ప్లాన్-ఎను అమలు పరుస్తున్నారు. అందుకోసం అటవీ ప్రాంతంలోని సుద్దవాగు, దోవకుంట తదితర ప్రాంతాల్లో విడతల వారీగా 40 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసి మరి అన్వేషణ చేపట్టారు. ఇప్పటికే దారి తప్పిన తల్లిపులి వయసు 8 సంవత్సరాలు ఉంటుందని, దానిని టి-108గా అటవీ అధికారులు గుర్తించారు. అది ఎక్కడ ఉందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ పులి అమ్రాబాద్ అటవీ ప్రాంత పరిధిలో జన్మించినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. తర్వాత ఇది ఇక్కడకు వచ్చిందని, ప్రస్తుతం ఈ పులి 4 ఆడ పులలకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది.

దేశ చరిత్రలోనే ఇదే మొట్టమొదటి సారి

ఏ పులులైనా కేవలం రెండు, మూడు పులులకు మాత్రమే జన్మనిస్తాయి. అందులో కేవలం ఒకటి గానీ రెండు పులి పిల్లలు మాత్రమే ఆరోగ్యంగా ఉంటాయని, అదే తరహాలో ఒకే సారి 4 పులి పిల్లలకు జన్మనివ్వడం, పులి కూనలు ఆరోగ్యంగా ఉండడం దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారి అని అటవీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఆడ పులి తన జీవిత కాలంలో 20 పులులను పునరుత్పత్తి చేయగలదు. ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్న అధికారులు మరోవైపు తల్లిపులి కన్పించకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. పులి పిల్లల ఆరోగ్య సంరక్షణపై అటవీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకోసం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల నుంచి ఇద్దరు వన్యప్రాణి వైద్య నిపుణులు పులి పిల్లల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తున్నారు.


300ల సిబ్బందితో అన్వేషణ

అటవీశాఖ పులి కూనలను తల్లిపులి చెంతకు చేర్చేందుకు దాదాపు 300ల మంది సిబ్బంది, 50 మందికి పైగా అధికారులు అన్వేషణ చేపట్టారు. వారితో పాటుగా ఉన్నతాధికారులు కూడా వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మూడ్రోజులుగా అటవీశాఖ సిబ్బంది పెద్ద గుమ్మడాపురం గ్రామంలో అనువణువు గాలిస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఆత్మకూరు, మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ల పర్యవేక్షణలో సిబ్బంది నిద్రహారాలుమాని విధులు నిర్వహిస్తున్నారు. వీరికి సహాయంగా గ్రామస్తులు కూడా పులి పిల్లలను తల్లి చెంతకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు. తల్లిపులి ఆచూకి, పులి కూనల ఆరోగ్య స్థితిగతులపై అటవీఅధికారులు ఎప్పటికప్పుడు అప్ డేట్ సమాచారం మీడియాకు అందజేస్తున్నారు.


కన్పించి..మాయమై

రెండ్రోజుల పాటు పులి పిల్లలకు దూరమైన తల్లిపులి మూడో రోజైన పెద్ద గుమ్మడాపురం-ముసలిమడుగు గ్రామాల మధ్యలో ఉన్న నీలగిరి మొక్కల్లోని కాల్వ వెంట పిల్లల కోసం అన్వేషిస్తుండగా గొర్రెలకాపరులు గమనించారు. భయాందోళన చెందిన వారు కేకలు వేయడంతో ఆ పులి పరుగులు తీసి మళ్లీ అడవిలోకి జారుకుంది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు హుటాహుటినా పిల్ల కూనలను తీసుకుని తల్లి చెంతకు చర్చేందుకు పరుగులు తీశారు. అయితే ఆ తల్లిపులి ఎక్కడికెళ్లిందనేది ప్రశ్నార్థంగా మారింది. అటవీ సిబ్బంది కాల్వ వెంట గాలిస్తున్నారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఆత్మకూరు, మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్లు, రేంజర్లు, ఇతర కిందిస్థాయి అధికారులు, సిబ్బంది పెద్దపులి అడుగు జాడలను గుర్తించారు. ఎక్కడైనా కన్పిస్తే పిల్లలను వాటి వద్దకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ పరిస్థితి మొదటికి రావడంతో నిరాశకు లోనయ్యారు. ఎలాగైనా గాలించి పిల్లలను తల్లి చెంతకు చేరుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed