సతీష్ కుమార్ ది ముమ్మాటికీ హత్యే: టీడీపీ నేత పట్టాభి

by Vemula.Srinu Prasad |

సతీష్ కుమార్ ది ముమ్మాటికీ హత్యేనని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు...

సతీష్ కుమార్ ది ముమ్మాటికీ హత్యే: టీడీపీ నేత పట్టాభి
X

దిశ, వెబ్ డెస్క్: ఏవీఎస్వో సతీష్ కుమార్ ది ముమ్మాటికీ హత్యేనని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. టీటీడీ ప‌ర‌కామ‌ణిలో ర‌వికుమార్ అనే ఉద్యోగి దొంగ‌త‌నం చేస్తుండ‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్న ఏవీఎస్వో సతీష్ కుమార్ తాడిప‌త్రి స‌మీపంలో రైలు ప‌ట్టాల‌పై అనుమానాస్పదంగా మృతిన విషయం తెలిసిందే. అయితే సతీశ్ మృతి వెనుక టీటీడీ మాజీ చైర్మ‌న్లు వై.వి.సుబ్బారెడ్డి, క‌రుణాక‌ర్ రెడ్డిల దొంగ‌ల ముఠా ఉంద‌ని పట్టాభి ఆరోపించారు. గుంత‌క‌ల్లు నుంచి తిరుప‌తిలోని సిట్ కార్యాల‌యానికి విచారణ నిమిత్తం బ‌య‌లుదేరిన స‌తీష్ కుమార్ తాడిప‌త్రి స‌మీపంలోని రైలు ప‌ట్టాల‌పై విగ‌త జీవిగా ప‌డిఉన్నాడ‌ని, ఇది ముమ్మాటికీ హ‌త్యేన‌ని, ఆత్మ‌హ‌త్య కాద‌న్నారు. సిట్ విచార‌ణ‌లో స‌తీష్ కుమార్ వాస్త‌వాలు వెల్ల‌డిస్తే ఎక్క‌డ త‌మ‌కి ఉచ్చు బిగుస్తుందోన‌నే భ‌యంతో అప్ప‌టి టీటీడీ మాజీ చైర్మ‌న్లు వై.వి.సుబ్బారెడ్డి, భూమ‌న‌ కరుణాకర్ రెడ్డిల దొంగ‌ల ముఠాతో అత్యంత కిరాతకంగా హ‌త్య చేయించారని పట్టాభి మండిప‌డ్డారు.

ప‌ర‌కామ‌ణి చోరీ అంశంలో కీల‌కపాత్ర పోషించిన‌ వ్య‌క్తులు వై.వి.సుబ్బారెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డేన‌ని, ఈ చోరీ ఉదంతం బ‌య‌టప‌డ‌టం, త‌ర్వాత లోక్ అదాల‌త్‌లో రాజీ కుద‌ర‌టం జ‌రిగింద‌ని పట్టాభి గుర్తు చేశారు. వై.వి.సుబ్బారెడ్డి టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న‌ప్పుడు 2023 జూన్ 19వ తేదీన నిందితుడి ర‌వికుమార్‌కి సంబంధించిన కొన్ని ఆస్తులు టీటీడీకి ఇస్తున్న‌ట్లు తీర్మానం చేశారన్నారు. జ‌గ‌న్ సొంత బాబాయి వై.ఎస్.వివేకానంద రెడ్డి గొడ్డ‌లి పోటుతో కిరాత‌కంగా హత్య‌కు గురైతే దాన్ని గుండెపోటుగా మార్చి ప్ర‌జ‌ల‌ను, చ‌ట్టాన్ని మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆయన వ్యాఖ్యానించారు. స‌తీష్ కుమార్ హత్య విష‌యంలో సిట్ ఒత్తిడి త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటూ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి నంగ‌నాచి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నిజంగా సిట్ ఒత్తిడి త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకునే ప‌రిస్థితి ఉంటే గ‌తంలో నిర్భ‌యంగా సిట్ ముందుకు హాజ‌రై కీల‌క విష‌యాలు ఎలా వెల్ల‌డిస్తాడ‌ని ప్రశ్నించారు. ఇదంతా కేవ‌లం ప్ర‌జ‌ల‌ను, చ‌ట్టాన్ని దారి మ‌ళ్లించ‌టానికే క‌రుణాక‌ర్ రెడ్డి ఆడుతున్న నాట‌కాల‌ని, దీన్ని ఎవ‌రు న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని పట్టాభి పేర్కొన్నారు.

Next Story