విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. మరోసారి హెచ్చరించిన జగన్

by Gantepaka Srikanth |

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ(YCP) నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని మాజీ సీఎం జగన్(Jagan) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. మరోసారి హెచ్చరించిన జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ(YCP) నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని మాజీ సీఎం జగన్(Jagan) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్ప‌డ‌డం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని మీకు ఎవరు ఇచ్చారని అడిగారు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్‌లో దాచిపెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు అని జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారని అన్నారు. ఇక ప్రజలు ఎంతమాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగేంతవరకూ ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టబోమని జగన్ కీలక ప్రకటన చేశారు.

Next Story