కల్తీ నెయ్యి కాదు... అది అసలు నెయ్యే కాదు : మంత్రి ఆనం

by Thanuru Gopichand |

తమ ప్రభుత్వ హయాంలో తిరుమలలో మహాపాపాలు చేసిన వైసీపీ వాటి నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్తీ నెయ్యి కాదు... అది అసలు నెయ్యే కాదు : మంత్రి ఆనం
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu) కోసం వాడింది కల్తీ నెయ్యి కాదని.. అది అసలు నెయ్యే కాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy) అన్నారు. శ్రీతల్పగిరి రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూటమి పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో ఘోర అపచారాలు, మాహాపాపలు, అక్రమాలు జరిగాయన్నారు. పాలు, వెన్న లేకుండానే నెయ్యి తయారు చేసిన ఘనత జగన్ (YS Jagan) కే దక్కుతుందన్నారు. తద్వారా ప్రపంచంలోనే తొమ్మిదో వింతను ఆయన కనిపెట్టారని ఎద్దేవా చేశారు. ఆ ఫార్మూలను ఆయన ఇప్పుడు మరచిపోయారని దెప్పి పొడిచారు. 2020లో వైసీపీ హయాంలోనే తీసిన శాంపిల్స్ పంపితే అందులో నెయ్యి లేదని.. జంతువుల కొవ్వు ఉందని తేలిందన్నారు. 2022లో నివేదికలు వస్తే నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. నెయ్యి లేని చోట నెయ్యి సృష్టించే భోలేబాబా కోసం నిబంధనలు మార్చారని విమర్శించారు.

హవాలా ద్వారా వందల కోట్లు

హవాలా ద్వారా రూ.వందల కోట్లు జగన్ కంపెనీలకి చేరాయని మంత్రి ఆరోపించారు. భోలేబాబా, వైష్ణవి వంటి కంపెనీలు అందుకు ముఖ్య భూమిక పోషించాయన్నారు. వైవీ సుబ్బారెడ్డి పీఏకే రూ.4.5కోట్లు డైరెక్ట్ గా బ్యాంకు లావాదేవీలు జరిగాయని.. ఆ లెక్కన పెద్దలకి ఎంత పెద్ద మొత్తాలు చేరాయి? ప్రజలే ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు అన్నీ నెయ్యి‌లో కల్తీలు జరిగాయని తేల్చాయని స్పష్టం చేశాయన్నారు. మూడున్నర ఏళ్ల పాటు మనుషులు తినకూడని కెమికల్స్, సింథటిక్ కెమికల్స్ కలిపిన లడ్లు తయారీ చేశారని పేర్కొన్నారు. ల్యాబుల్లో వాస్తవాలు బయటపడ్డాయని, తిరుమలలో చేసిన పాపాలపై ప్రజల్లో చర్చలు జరగకుండా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారని విమర్శించారు.

తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యం

తిరుమల దేవస్థానం పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. భగవంతుడిపై రాజకీయాలు చేయడాన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వందల ఏళ్లుగా నాణ్యమైన వస్తువులతోనే లడ్డూలు తయారవుతున్నాయని పేర్కొన్నారు. అదే ఆచారాన్ని కూటమి ప్రభుత్వం మరలా పునరుద్ధరిచిందన్నారు.

Next Story