పోలీసుల వేధింపులు.. మహిళ ‘సెల్ఫీ’ సూసైడ్

by Ramesh Naini |

గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

పోలీసుల వేధింపులు.. మహిళ ‘సెల్ఫీ’ సూసైడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. చేయని తప్పుకు తనను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి వేధించారనే మనస్తాపంతో తిరుపతమ్మ అనే మహిళ గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమె, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. వివరాల్లోకి వెళితే... బాధితురాలు తిరుపతమ్మ తన భర్తతో కలిసి కొత్తపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే, అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ మహిళ తన వద్ద బంగారం అడిగి తీసుకుని, తిరిగి ఇవ్వకుండా మోసం చేసిందని తిరుపతమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా తెనాలి ఒకటో పట్టణ (వన్ టౌన్) పోలీసులు ఆమెను స్టేషన్‌కు పిలిపించి విచారణ పేరుతో తీవ్రంగా వేధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సెల్ఫీ వీడియోలో ఆవేదన

బంగారం రికవరీ కేసు వ్యవహారంలో పోలీసులు తనను అకారణంగా వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు ముందు తిరుపతమ్మ ఓ సెల్ఫీ వీడియోను రికార్డు చేసింది. అపార్ట్‌మెంట్‌ వాసి తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని, తాను చేయని నేరానికి వన్ టౌన్ పోలీసులు తనను స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేశారని ఆ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

Next Story