Velagapudi: సీఎం జగన్‌ను అభినందిస్తే తప్పేంటి: చంద్రశేఖర్‌రెడ్డి

by srinivas |
Velagapudi: సీఎం జగన్‌ను అభినందిస్తే తప్పేంటి: చంద్రశేఖర్‌రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్‌ను పొగుడుతూ చేస్తున్న వ్యాఖ్యలను భజనగా అభివర్ణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ట్రోల్స్‌పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌ రెడ్డి స్పందించారు. ఉద్యోగులకు సీఎం జగన్‌ మంచి చేస్తుంటే అభినందించకుండా ఎలా ఉంటామన్నారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి, సీఎంకు కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు తొత్తులుగా ఉన్నారంటూ వస్తున్న విమర్శలను చంద్రశేఖర్ రెడ్డి కొట్టి పారేశారు.

ఉద్యోగులకు సంబంధించి ఒకేసారి ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు స్వాగతించకుండా ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేయాలని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ఇబ్బందులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించింది కాబట్టి అభినందిస్తున్నాయని చెప్పారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు తమ ఇళ్లల్లో సీఎం ఫొటో పెట్టుకుంటామని చెబుతున్నారని...ఎందుకంటే 20 ఏళ్లుగా పరిష్కారం కాని వారి సమస్యను సీఎం జగన్‌ పరిష్కరించారని కొనియాడారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాల నేతలను విమర్శించడం సరికాదని...రాజకీయ పార్టీలు చెప్పినట్టు ఉద్యోగ సంఘాలు నడుచుకోవని, ఉద్యోగులకు మేలు జరిగినప్పుడు పొగడడంలో తప్పులేదని సమర్థించుకున్నారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారని...దానిపై చంద్రబాబును అడిగితే తాము మేనిఫెస్టోలో పెట్టలేదని అన్నారని గుర్తు చేశారు. మేనిఫెస్టోకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై గత ప్రభుత్వం ఎలాంటి విలువ ఇచ్చిందో ఈ సమాధానం బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. కొత్త పీఆర్సీ కమిషన్‌ కోసం చలో అసెంబ్లీ, చలో రాజధాని కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉండేదని...కానీ ఇప్పుడు అవేమీ లేకుండానే సీఎం తనంతట తానుగా 12వ పీఆర్సీ కమిషన్‌ నియమిస్తామని చెప్పడం అభినందించదగ్గ విషయం అని కొనియాడారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను సెప్టెంబర్ నెలాఖరు కల్లా క్లియర్‌ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని, అలాగే కేబినెట్‌లో ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు ఆరు నెలల్లో అమలులోకి వచ్చేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed