మంచి పని చేశారు.. మీకివే మా అభినందనలు

by Thanuru Gopichand |

కలెక్టర్లను అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు.

మంచి పని చేశారు.. మీకివే మా అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) పాలన అనగానే చాలా మంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకంటే విధి నిర్వహణ విషయంలో పొరపాట్లు జరిగితే సీఎం చంద్రబాబు ఏ మాత్రం ఉపేక్షించారు. పనులు నిబంధనల ప్రకారం, నిర్ణీత వ్యవధిలో పూర్తి కావాలని కచ్చితంగా చెప్పేస్తారు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం లెఫ్ట్ రైట్ ఆడేసుకుంటారు. అందుకే సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన గురించి తెలిసినవారు అంటారు. అయితే బాధ్యతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో.. పనిలో అద్భుత ప్రదర్శన చూపిస్తే అంతే ఆప్యాయంగా అభినందిస్తారు కూడా. ఆ మాటను నిజం చేస్తూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ఓ పోస్టు చేశారు. అందులో కృష్ణా, పల్నాడు జిల్లాల కలెక్టర్లను అభినందించారు. నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే పనులు చేసినందుకు ప్రశంసించారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం పట్లు సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ ఏం చేశారంటే..

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఉపయోగపడే పనులను చేయాలని కలెక్టర్ బాలాజీ (Collector Balaji) అధికార యంత్రాంగానికి సూచించారు. ఆయన సూచనపై సానుకూలంగా స్పందించిన జిల్లా అధికారులు జిల్లాలోని బాలికల సంక్షేమ వసతి గృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్సినిరేటర్లను సమకూర్చింది. అంతేకాకుండా విద్యార్థులు కూర్చునేందుకు బలలను కూడా అందజేశారు. ఒక్కోటి రూ.12,500లు విలువ చేసే 48 ఇన్సినిరేటర్లు, 972 చిన్న బల్లలను హాస్టళ్ల అధికారులకు కలెక్టర్ అందించడంతో పాటు వాటిని సమకూర్చిన సిబ్బందిని అభినందించారు.

పల్నాడు జిల్లా కలెక్టర్.. పుస్తకాలు

తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారు కానుకలుగా పుస్తకాలను తీసుకురావాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా (Collector Krithika Shukla) సూచించారు. ఆమె సూచనల మేరకు కలెక్టరేట్ అధికారులు సిబ్బంది, నోటు పుస్తకాలు, స్టేషనరీ, పోటీ పరీక్షల పుస్తకాలు, నిఘంటువులు, పెద్ద బాలశిక్ష వంటివి బహమతిగా ఇచ్చారు. వాటిని కలెక్టర్ హాస్టళ్ల విద్యార్థులకు, గ్రంథాలయాలకు అందజేశారు.

Next Story