ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-19 07:47:12  IST  )

విజయవాడ ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నదికి గంటగంటకూ వరదనీటి ప్రవాహం పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి వరద తాకిడి పెరగడంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 3.91 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి ఇన్ ఫ్లో 6 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి వచ్చిన వరదనీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శాంతించమ్మ కృష్ణమ్మా.. అంటూ మహిళలు ఘాట్ల వద్ద పూజలు చేసి, నదికి హారతులిస్తున్నారు.

భారీగా వరదనీరు వస్తుండటంతో బెజవాడవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతేడాది బెజవాడలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు కట్ట తెగి సంభవించిన వరదల కారణంగా అనేకమంది నిరాశ్రయులయ్యారు. వరదనీరు తగ్గుముఖం పట్టాక ఇళ్లకు వెళ్లాక ఇంటినిండా పేరుకున్న బురద చూసి కన్నీరు పెట్టుకున్నారు. వరదనీటిలో మునిగి కొందరు చనిపోయిన దృశ్యాలు ఇంకా కళ్లెదుటే మెదలుతుండగా.. వరద హెచ్చరికలు బెజవాడవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Next Story