చంద్రబాబును పవన్ కల్యాణ్ భుజాన ఎత్తుకున్నా గెలిచేది జగనే: మంత్రి అంబటి రాంబాబు

by Disha Web Desk 21 |
చంద్రబాబును పవన్ కల్యాణ్ భుజాన ఎత్తుకున్నా గెలిచేది జగనే: మంత్రి అంబటి రాంబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప పాద‌యాత్ర‌లో, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని కాబట్టి ప్రజలు కూడా వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. వైఎస్ జగన్ నిరంతరం పేదల కోసం పరితపిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట వ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు జరగుతున్నాయని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశాడని ఆరోపించారు. బంగారు రుణాలు మాఫీ అంటూ చేతులెత్తేశాడు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్‌ కల్యాణ్ పాత్ర కూడా ఉందని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు.అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదని చెప్పుకొచ్చారు. పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్‌ రాష్ట్రానికి కావాలి.మళ్లీ ఆయనే సీఎం కావాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. 2024లో పేదలకు-పెత్తందారులకు ఎన్నికలు జరుగుతున్నాయని..పేదల తరపున పోటీ చేసి గెలిచే వ్యక్తి సీఎం జగన్‌ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నాగెలిచేది వైఎస్‌ జగనే అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

87% ప్రజలకు మేలు జరిగింది

ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి గత నాలుగేళ్ల పాలనలో అమలు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేసే దిశలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందన్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో జగనన్న ప్రభుత్వం బటన్ నొక్కండం ద్వారా పేదల బ్యాంకు ఖాతాలో రూ.2,35,000 లక్షలు జమ చేశామని అన్నారు. ఇంటి వద్ద కే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. జనవరి నుంచి 3 వేల రూపాయల సామాజిక భద్రత పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 87 శాతం మంది ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం వెనుక ప్రజలు ఉంటారనే నమ్మకంతో ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే లు జక్కంపూడి రాజా, జి. శ్రీనివాస నాయుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed