ఊపందుకున్న రాజధాని నిర్మాణాలు.. 3 వేలమంది కార్మికులు, 500 యంత్రాలతో పనులు

by srinivas |   ( Updated:2025-04-14 15:27:58.0  )
ఊపందుకున్న రాజధాని నిర్మాణాలు.. 3 వేలమంది కార్మికులు, 500 యంత్రాలతో పనులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(AP capital Amaravati) నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పలు భవన నిర్మాణాలను ప్రారంభించింది. భారీ సంస్థల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రారంభమైన పనులను చకచకగా పూర్తి చేసేందుకు 3 వేల మంది కార్మికులు నిమగ్నమయ్యారు. 500 యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ సోమవారం స్పష్టం చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాజధాని పనులను ప్రారంభించింది. తొలుత రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలను తొలగించారు. ఆ తర్వాత నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం కృష్ణానది తీరంలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నది లంక భూములను మంత్రి నారాయణ(Minister Narayana) పరిశీలించారు. తన బృందంతో ఎన్టీఆర్, గుంటూరు జిల్లా పరిధిలోని పెదలంక, చినలంకలోని భూముల వద్దకు వెళ్లారు. స్పోర్ట్స్ సిటీని ఏర్పాటుకు భూములు పనికొస్తాయా.. లేదా అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబుతో పాటు సదరు మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం స్పోర్ట్ సిటీ ఏర్పాటు పనులను ప్రారంభించనున్నారు.

Next Story

Most Viewed