సీఎం జగన్ సెల్ఫ్ గోల్..! వివేకా హత్య కేసులో చంద్రబాబుపై పరోక్ష ఆరోపణలు

by Disha Web Desk 1 |
సీఎం జగన్ సెల్ఫ్ గోల్..! వివేకా హత్య కేసులో చంద్రబాబుపై పరోక్ష ఆరోపణలు
X

వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీఎం జగన్ వ్యాఖ్యలు విపక్షాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. సామాన్యులు సైతం ఇదేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. హత్య జరిగిన సమయంలో వైసీపీ నేతల పొంతన లేని ప్రకటనలు చేశారు. చంద్రబాబు ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు గుప్పించారు. సీబీఐ దర్యాప్తు చేసి కొందరిని నిందితులుగా పేర్కొంటూ అదుపులోకి తీసుకుని చార్జిషీట్ వేసి అరెస్టు చేసింది. అదే క్రమంలో దోషులను సీఎం జగనే కాపాడుతున్నారంటూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. కేసును సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లారు. ఇంత జరిగినా.. మళ్లీ సీఎం జగన్ పరోక్షంగా చంద్రబాబుపై నిందారోపణలు చేయడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్​ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సొంత జిల్లా కడప నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వివేకా హత్య కేసు గురించి ప్రస్తావిస్తూ.. దోషులతో తన చెల్లెళ్లు చేతులు కలపడం బాధగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా చంద్రబాబుకు హత్యతో సంబంధం ఉందని పరోక్షంగా వెల్లడించారు. ఆయన అలా అన్నారో లేదో ఆ పార్టీ కీలక నేతలు సైతం చంద్రబాబే సూత్రధారి అంటూ నేరుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కుటుంబ విషయాలను ప్రచారంలో బయట పెట్టుకోవడం సీఎం జగన్ సెల్ఫ్‌గోల్ చేసుకోవడమేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సొంత వారే నిలదీసినా కిమ్మనని జగన్..

వివేకా భార్య సౌభాగ్యమ్మ, తనయ సునీతారెడ్డి జగన్​కు ఓటెయ్య వద్దని రాష్ట్ర ప్రజలకు విన్నవించారు. రాయలసీమతోపాటు రాష్ట్రమంతా ఈ విషయం పాకింది. సోదరి షర్మిల అయితే జగన్ ను నేరుగా నిలదీశారు. అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఐదేళ్ల నుంచి కేసును ఎందుకుఛేదించలేకపోయారని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్​ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వస్తే ఆపిందెవరంటూ దుమ్మెత్తిపోశారు. అసలు వివేకా కేసు గురించి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం వల్ల జగన్ కు మేలు కన్నా నష్టమే ఎక్కువని విశ్లేషకులు అంటున్నారు.

జగన్ వ్యాఖ్యలతో వైసీపీకే నష్టం..

వివేకా హత్య కేసుపై ఉన్నత న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్​ నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. వివేకా హత్యను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్​.. వివేకా కేసుకు సంబంధించి చంద్రబాబుపై ఆరోపణలు సంధించడం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నారేంటని సగటు ప్రజలు బుగ్గలు నొక్కుకుంటున్నారు. ప్రతిపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడానికి సీఎం జగన్​ అసలు వివేకా కేసు విషయాన్ని ప్రస్తావించకుండా ఉండాల్సిందని పరిశీలకులు చెబుతున్నారు. అంతిమంగా ఇది వైసీపీకే నష్టమని అంచనా వేస్తున్నారు.

Read More..

వైసీపీకి బిగ్ షాక్.. ఆ ఆరుగురిపై ఈసీ వేటు


Next Story