సొంత ఇలాఖాకు సీఎం జగన్.. మూడు రోజులు అక్కడే మకాం

by Disha Web Desk 21 |
YS Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత జిల్లా పర్యటన దాదాపు ఖరారైంది. మూడు రోజులపాటు సొంత ఇలాఖాలోనే సీఎం వైఎస్ జగన్ ఉండనన్నారు. ఈ మేరకు సీఎంవో జగన్ పర్యటన వివరాలను వెల్లడించింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు, క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు.ఇందులో భాగంగా ఈ నెల23న ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్‌ ప్లాంట్‌లను ప్రారంభించి, చైర్మన్, ఉద్యోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత కడప రిమ్స్‌ వద్ద డాక్టర్‌ వైఎస్ఆర్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దాంతోపాటు డాక్టర్‌ వైఎస్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ను ప్రారంభింస్తారు. అనంతరం అదే రిమ్స్‌ ప్రాంగణంలో డాక్టర్‌ వైఎస్ఆర్ క్యాన్సర్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిని సైతం సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆధునికీకరించిన కలెక్టరేట్‌ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్‌ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్‌ రోడ్స్‌ సర్కిల్‌ ప్రారంభిస్తారు. మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో సీఎం వైఎస్ జగన్ రాత్రికి బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వైఎస్ఆర్ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు, అనంతరం మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్క్‌లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. ఈ నెల 25న ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. అక్కడ సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Next Story

Most Viewed