2047 నాటికి భారత్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా మారుతుంది: చంద్రబాబు

by Ajay Maddhiboyina |

2047 నాటికి భార‌త్ ప్ర‌పంచంలో తిరుగులేని శ‌క్తిగా మారుతుంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. తిరుప‌తిలో నిర్వ‌హించిన కూట‌మి రెండేళ్ల పాల‌న స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు.

2047 నాటికి భారత్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా మారుతుంది: చంద్రబాబు
X

దిశ‌, వెబ్ డెస్క్: 2047 నాటికి భార‌త్ ప్ర‌పంచంలో తిరుగులేని శ‌క్తిగా మారుతుంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. తిరుప‌తిలో నిర్వ‌హించిన కూట‌మి రెండేళ్ల పాల‌న స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. త‌న రాజ‌కీయ ప్ర‌యాణం తిరుప‌తి నుండే మొద‌లైందని చెప్పారు. 2019లో ప్ర‌జావేదిక కూల్చివేత‌తో జ‌గ‌న్ విధ్వంస పాల‌న మొద‌లైందని మండిప‌డ్డారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని అన్నారు. కేంద్ర ప్రాజెక్టులు ప‌క్క‌న ప‌డేశార‌ని, సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయ‌ని చెప్పారు. కేసులు, జైళ్ల‌తో రాష్ట్రంలో చీక‌టి పాల‌న సాగింద‌ని ఆరోపించారు. నిధులు లేవ‌ని వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్వీర్యం చేశార‌ని అన్నారు. అలాంటి ద‌శ‌లో నాలుగోసారి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించాన‌ని, వెంటిలేట‌ర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సీజ‌న్ అందించార‌ని చెప్పారు.

పోల‌వ‌రం, అమ‌రావ‌తి, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటులో కేంద్రం స‌హ‌కారం ద‌క్కింద‌న్నారు. రాష్ట్రం, దేశం ఎప్పుడూ బాగుండాల‌ని భావించే వ్య‌క్తి ప‌వ‌న్ క‌ల్యాణ్ అని కొనియాడారు. ప్ర‌జ‌ల చేత ఎన్నికై ప‌న్నెండేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక ప్ర‌ధాని మోడీ అని అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం.. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌దామ‌ని ప్ర‌జ‌ల‌ను కోరామ‌ని తెలిపారు. 2024లో 57 శాతం ఓట్ షేర్, 94 శాతం స్ట్ర‌యిక్ రేట్ సాధించామ‌ని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుప‌రిపాల‌న అనే మూడు ల‌క్ష్యాల‌తో ముందుకు వెళుతున్నామ‌ని అన్నారు. హామీ ఇచ్చిన‌ట్టుగా రాష్ట్రంలో అన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని అన్నారు. వ‌చ్చే నెల‌లో రాయ‌ల‌సీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తామ‌ని, ల‌క్ష కోట్ల‌తో రాయ‌ల‌సీమ ముఖచిత్రాన్ని మారుస్తామ‌ని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో జిల్లాల‌ను అడ్డ‌గోలుగా విభ‌జిస్తా కూట‌మి వ‌చ్చాక స‌రిచేశామ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వంలో తిరుమ‌ల శ్రీవారికి అప‌చారం జ‌రిగింద‌ని వ్యాఖ్యానించారు. అన్ని ఆల‌యాల‌పై ప‌ద్ద‌తి ప్ర‌కారం దాడులు చేశార‌ని ఆరోపించారు.

Next Story