పాలనలో ఆరు నెలలు పూర్తి.. చంద్రబాబు సంచలన ట్వీట్

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు...

పాలనలో ఆరు నెలలు పూర్తి.. చంద్రబాబు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యిందని సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) తెలిపారు. ఐదేళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు తాను, తన మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దామన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామని చెప్పారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు.

సంక్షేమమే రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పిచ్చిపిచ్చి రంగులు ఉండవని, తమ బొమ్మలు కూడా కనిపించవని తెలిపారు. పబ్లిసిటీ కంటే రియాలిటీ‌కే తాము ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. ‘‘ 'రాష్ట్రమే ఫస్ట్...ప్రజలే ఫైనల్' అనే నినాదం ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు. ప్రజలందరి సహకారంతో స్వర్ణాంధ్ర - 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Next Story