ఎవరి గోల వారిదే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనన్న వైసీపీ

by Disha Web Desk 6 |
ఎవరి గోల వారిదే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనన్న వైసీపీ
X

దిశ ప్రతినిధి, అనంతపురం: అనంతపురము-కడప-కర్నూలు జిల్లాల పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికకు తెర పడింది. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ, అనూహ్య పరిణామాల అనంతరం తెలుగుదేశం పార్టీ బలపరచిన అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. సుదీర్ఘంగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ లో రామగోపాలరెడ్డి 7543 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపు పై ఆయా పార్టీలు తమతమ వాదనలను, భిన్న విశ్లేషణలను వెల్లడిస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం నైతిక విజయం తమదేనని ఢంకా బజాయిస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఓటర్లలో సరైన అవగాహన లేకపోవడంతోనే తాము ఓడిపోయామని చెబుతోంది. ఇక ప్రతిపక్ష

తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రజలలో ప్రభుత్వం పట్ల నెలకొన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు నిదర్శనమని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో తాము ఎక్కువ స్థానాలలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక వామపక్ష పార్టీలు మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గట్టెక్కారని, అది తమ చలవేనని అంటున్నాయి. ఇలా ఆయా పార్టీలవారీగా చేస్తున్న వాదనలు, విశ్లేషణలు ఇలా ఉన్నాయి.

నైతిక విజయం మాదే: వైసీపీ

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో నైతిక విజయం తమదేనని అధికార పార్టీ బలంగా వాదిస్తోంది. అయితే గ్రాడ్యుయేట్ ఓటర్లలో నెలకొన్న అవగాహన రాహిత్యంతోనే తాము ఓడిపోవాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతోపాటు మొదటి ప్రాధాన్యత ఓట్లలో తాము సాధించిన ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. ఇది ఏ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత కాదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ చెబుతోన్న ప్రకారం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే మొదటి ప్రాధాన్యతలో ఆధిక్యత ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని వారు చెబుతుండడం గమనార్హం.

అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత: టీడీపీ

అయితే ఈ గెలుపుపై సంతృప్తిని వ్యక్తం చేస్తోన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని అంటోంది. యువత, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతకు ఈ గెలుపు అద్దం పడుతోందని చెబుతోంది. అధికార పార్టీ ఈ ఎన్నికలను రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా పేర్కొని బొక్క బోర్లా పడిందని వ్యాఖ్యానిస్తోంది. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేరని, అందుకు ఈ ఎన్నికలే నిదర్శనమని అంటోంది. అందుకే తమకు ఘన విజయం సాధించి పెట్టారని, ఇదే ఊపును రానున్న ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలనకు ఈ ఎన్నికలు ఉదాహరణలని పేర్కంటోంది.

ఇది మా చలవే: వామపక్ష పార్టీలు

ఈ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటులో భాగంగా లెక్కించినప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారని, ఇది కేవలం తమ చలవేనని వామపక్ష పార్టీలకు చెందిన విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కూడా కారణమని, అయితే తమ అభ్యర్థికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓటు వల్లనే గెలుపొందారని చెబుతున్నారు.

Also Read..

ఎన్నికల నాటికి బలపడకుంటే సైకిల్ పార్టీ చతికిలపడినట్లేనా?


Next Story